తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు హైదరాబాద్ భక్తుడు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు. ఈ మేరకు విరాళం తాలూకూ డీడీని సోమవారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి అందజేశారు. శ్రీనివాసులు రెడ్డి గతంలోనూ టీటీడీకి అనేకసార్లు విరాళాలు అందించారు. టీటీడీలోని వివిధ పథకాలకు రూ. 30 లక్షలను విరాళంగా అందజేసినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఇచ్చిన రూ.10 లక్షలతో కలిపి ఇప్పటి వరకూ శ్రీవారికి రూ. 40 లక్షలు అందించారని తెలిపాయి. ఈ సందర్భంగా దాత శ్రీనివాసులు రెడ్డిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
మరోవైపు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కొలువైన వెంకటేశ్వర, మహాగణపతి ఆలయాల 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెలాఖర్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7 వరక వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం నిర్వహిస్తారు. మార్చి 6వ తేదీన చక్రస్నానం, రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మార్చి 7న సాయంత్రం 3 – 5 గం.ల మధ్యన పుష్పయాగం నిర్వహిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
కళ్యాణ వెంకటేశ్వరస్వామి చక్రస్నానం
మరోవైపు తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు, అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం పది నుంచి పదిన్నర మధ్య ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa