వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు గుప్పించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వైసీపీ బాయ్కాట్ చేయడాన్ని షర్మిల తప్పుబట్టారు. జనాలు ఛీ కొడుతున్నా కూడా జగన్ తీరు మారడం లేదని షర్మిల ఎద్దేవా చేశారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికి అసెంబ్లీకి వచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా వైసీపీకి ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అంటూ షర్మిల ట్వీట్ చేశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వైసీపీకి ప్రతిపక్ష హోదానే కావాలా అంటూ ప్రశ్నించిన షర్మిల.. ప్రజా శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదనుకుంటే, ప్రజాసమస్యలపై చిత్తశుద్ది ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని షర్మిల కోరారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదని.. దిశానిర్దేశం అంతకన్నా లేదని విమర్శించారు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలని మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదన్న షర్మిల.. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా ఐదు హామీలపై స్పష్టత లేదని షర్మిల విమర్శించారు. మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారే కానీ.. చంద్రబాబు విజన్ 2047కి దమ్ము లేదని షర్మిల విమర్శించారు. గత ఎనిమిది నెలల నుంచి కాలయాపన తప్ప కమిట్మెంట్ కనిపించలేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని..కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటీ లేవని షర్మిల ఆరోపించారు. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa