ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ మద్యం పాలసీతో రూ.2 వేల కోట్ల నష్టం.. కాగ్ సంచలన నివేదిక

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 08:02 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంచలన నివేదికను బయటపెట్టింది. గత ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీతో ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్టినట్టు పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాగ్ నివేదిక బయటకు రాగా.. తాజాగా బీజేపీ ప్రభుత్వం దీనిని అసెంబ్లీ ముందుంచింది. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించారని కాగ్ ఆరోపించింది. ఉల్లంఘనలపై జరిమానా విధించలేదని, పాలసీ రూపకల్పనలో పారదర్శకత పాటించకపోవడం వంటి చోటుచేసుకున్నాయని కాగ్‌ తూర్పారబట్టింది.


ఢిల్లీ కొత్త మధ్యం విధానం కారణంగా ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అలాగే, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయినట్టు తెలిపింది. అంతేకాదు, లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందని వివరించింది. మొత్తంగా ఈ పాలసీ వల్ల రూ.2002.68 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్ దర్యాప్తులో వెల్లడైనట్టు నివేదిక స్పష్టం చేసింది.


కాగా, కేజ్రీవాల్ సర్కారు 2021లో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆప్ ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. కేసులు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా సహా పలువురి నేతలను అరెస్ట్ చేశాయి. సౌత్ గ్రూప్‌కి లబ్ది చేకూర్చేలా నిబంధనలు తీసుకొచ్చి, క్రిడ్ ప్రోకోకు పాల్పడ్డారన,ి ఈ వ్యవహారంలో వచ్చిన రూ.100 కోట్లను గోవా ఎన్నికల కోసం ఆప్ ఖర్చుచేసిందనేది ప్రధాన ఆరోపణ. మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లిన కేజ్రీవాల్, సిసోడియాలు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.


మరోవైపు, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఇప్పటికే అసెంబ్లీలో అంబేడ్కర్, భగత్ సింగ్ ఫోటోలను తొలగించారని ఆప్ ఆరోపిస్తోందది. ఈ క్రమంలో మొదటి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగాన్ని ఆప్ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ ఆటంకం కల్పించారు. దీంతో 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa