ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళాఖాతంలో భూకంపం.. వణికిన కోల్‌కతా, భువనేశ్వర్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 08:04 PM

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఒడిశాలోని పూరీ తీరానికి సమీపంలో 91 కి.మీ లోతున ఉదయం 6.10 గంటలకు భూకంపం సంభవించినట్టు తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ్‌ బెంగాల్‌‌, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. కోల్‌కతా, భువనేశ్వర్ సహా చాలాచోట్ల ప్రకంపనలు వచ్చినట్టు తెలిపింది.కోల్‌కతా నగరంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదయినట్టు తెలుస్తోంది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగిందా? అనేది? స్పష్టత లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


కాగా, సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు భూకంపం గురించి పోస్ట్‌లు పెడుతున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్)‌లో Earthquake హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తీవ్రత గురించి, ఆ ప్రాంతాల్లోని వ్యక్తుల భద్రత గురించి ఆరా తీస్తున్నారు. ‘‘భూకంప హెచ్చరిక! కోల్‌కతాలో ఉదయం 6:10 గంటలకు గూగుల్‌లో భూకంప హెచ్చరిక వచ్చింది.. ఒడిశా నుంచి 175 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి... మరెవరైనా ప్రకంపనలను అనుభవించారా? అధికారిక నిర్ధారణ కోసం వేచి చూస్తున్నాను.. అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి!’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


కాగా, కోల్‌కతా భూకంపాలు సంభవించే మూడో జోన్‌లో ఉంది. అంటే, భూకంపాల ముప్పు మధ్యస్థంగా ఉంటుంది. ఈశాన్య భారతదేశం, హిమాలయాలు లేదా గుజరాత్ వంటి ప్రదేశాల మాదిరిగా భారీ భూకంపాలకు గురయ్యే అవకాశం లేనప్పటికీ.. అప్పుడప్పుడు నగరాన్ని ప్రకపంనలు కుదిపేస్తున్నాయి. బంగాళాఖాతం, నేపాల్ లేదా ఈశాన్య భారత్ వంటి సమీప ప్రాంతాలలో భూకంప కార్యకలాపాల వల్ల ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.


హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. మండి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయినా.. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం మాత్రం వాటిల్లలేదు. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతగా నమోదయిన ఈ భూకంప కేంద్రాన్ని సుందర్‌నగర్ సమీపంలో కియార్గీ వద్ద 7 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa