ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులు దోచినా దొరకని సొమ్ము,,, ఆ ఒక్క టాయిలెట్ వల్ల దొరికింది

international |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 08:05 PM

బంగారు నగలు, డబ్బు, వాహనాలు, విలువైన వస్తువులు వంటివి దొంగతనం చేయడం గురించి మన అందరికీ తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే దొంగలు మాత్రం ఏకంగా ఓ వెస్టర్న్ కమ్మోడ్ టాయిలెట్‌ను దొంగిలించారు. అలా అని వారిని చీప్‌గా తీసి పడేశారంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకూ అంటారా.. అది టాయిలెట్‌యే అయినా దాని విలువ మాత్రం అక్షరాల 30 కోట్ల రూపాయలు. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండి నిజం. ఆ టాయిలెట్ కమ్మోడ్‌ను 98 కిలోల బంగారంతో తయారు చేయించడం వల్ల దాని విలువ అంతగా ఉంది. అందుకే దొంగలు దాన్ని.. ముక్కలుగా చేసి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చోరీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఇంగ్లండ్‌లోని బ్లైన్‌హైమ్ ప్యాలెస్‌లో బంగారు టాయిలెట్ ఉంది. ఆ విషయం గుర్తించిన ఐదుగురు దొంగలు 2019సెప్టెంబర్ 14వ తేదీ తెల్లవారుజామునే దాన్ని కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. రెండు వాహనాల్లో వచ్చిన చోరులు.. ప్యాలెస్ చెక్క గేట్లను పగులగొట్టి భవనంలోకి ప్రవేశించారు. అయితే టాయిలెట్ ఎక్కడుందో ముందుగానే తెలిసిన ఈ ముఠా నేరుగా అక్కడికే వెళ్లి వెంట తెచ్చుకున్న పెద్ద పెద్ద సుత్తెలుతో దాన్ని పగులగొట్టారు. ఆపై ఆ బంగారు ముక్కలన్నింటినీ పట్టుకుని పారిపోయారు. కానీ సుత్తెలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈ దొంగతనం జరగ్గా.. సోమవారం రోజు దీని గురించి ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టులో ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.


18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఈ టాయిలెట్ మొత్తంగా 98 కిలోల బరువు ఉంది. దీన్ని ఇటాలియన్ ఆర్టిస్టు మౌరిజియో క్యాటెలన్ తయారు చేశారు. అలాగే ఈ బంగారు టాయిలెట్‌కు అమెరికా అనే నామకరణం కూడా చేశారు. అంతేకాకుండా ఆరు మిలియన్ల డాలర్లకు దీనిపై ఇన్సూరెన్స్ కూడా చేయించారు. అయితే దొంగతనం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆక్స్ ఫర్డ్‌కు చెందిన 39 ఏళ్ల మైఖేల్ జోన్స్, 36 సంవత్సరాలు ఫ్రెడ్రిక్ సైన్స్, 41 ఏళ్ల బోరా గుకుక్‌లు కూడా ఉన్నారు.


అయితే విచారణలో భాగంగానే ఈ ముగ్గురిని కోర్టులో హాజరు పరచగా.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మైఖేల్ జోన్స్ తేల్చి చెప్పారు.కానీ మరో ఇద్దరు మాత్రం తాము నేరం చేసినట్లు అంగీకరించారు. అలాగే వీరితో పాటు ఈ కేసులో జేమ్స్ షీన్, మిస్టర్ డీలు కూడా ఉండగా.. దొంగిలించిన ఈ బంగారు టాయిలెట్‌ను హటన్ గార్డెన్ జ్యువెల్లరీ షాపులో అమ్మినట్లు వివరించారు. కిలో బంగారానికి 25,632 డాలర్లు బేరం కుదుర్చుకోగా.. కొన్ని విడతల్లో ఆ బంగారాన్ని అమ్మేశారు. దీని దొంగతనం జరగినప్పుడు ఆ బంగారం విలువ 2.8 మిలియన్లు డాలర్లు (రూ.34 కోట్లకు పైమాటే) కాగా.. ప్రస్తుతం వీటి విలువ 30 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa