ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ వివాదం వేళ తెలంగాణ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 09:12 PM

త్రిభాషా విధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం నెలకున్న తరుణంలో మాతృ భాషలో విద్యా బోధనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని అన్ని పాఠశాలలు 9, 10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని పేర్కొన్నారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థుల సిలబస్‌ను ‘ప్రామాణిక తెలుగు’ నుంచి ‘సరళమైన తెలుగు’కి తగ్గించనున్నట్లు తెలిపారు.


బలవంతంగా హిందీని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తేలేదని తమిళనాడు.. కేంద్రం నిధులు కావాలంటే త్రిభాషా విధానం అమలుచేయాల్సిందేనని కేంద్రం పట్టుబడుతోంది. ఈ విషయంలో తాము యుద్ధానికి సిద్ధమని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 9, 10 తరగతులకు మాతృ భాష తెలుగును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, తెలంగాణ 1 నుంచి 10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాషను విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 30న చట్టం చేసింది. దీనికి అనుగుణంగా అదే ఏడాది జూన్‌లో జీవో 15ను అధికారులు జారీ చేశారు.


సీబీఎస్‌ఈ వంటి ఇతర బోర్డుల పరిధిలోని స్కూళ్లలో ఇప్పటి వరకు 1- 8వ తరగతి వరకు మాత్రమే తెలుగును బోధిస్తున్నారు. ప్రాథమిక స్థాయి (8వ తరగతి) వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఆంగ్లం, హిందీతోపాటు తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు. అయితే, 9, 10 తరగతుల్లో మాత్రం రెండు లాంగ్వేజ్‌లు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి ఇంగ్లిష్ తప్పనిసరి కాగా.. ఇంకోటి హిందీ లేదా ఇతర భాషను విద్యార్థులు అభ్యసిస్తున్నారు. కానీ, తాజాగా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది.


వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, ఆ తర్వాత ఏడాది పదిలో తెలుగు సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. తెలుగు మాతృభాష కాని వారి కోసం 2018-19లోనే వెన్నెల పేరిట సులభమైన తెలుగు వాచకాన్ని విద్యాశాఖ రూపొందించింది. ప్రస్తుతం 1-8 తరగతి వరకు దీన్ని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర పాఠశాలల్లోని విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. తాజాగా, 9, 10 తరగతుల విద్యార్థులూ ఉపయోగించేందుకు అధికారులు అనుమతిచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa