ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగిన మైకంలో పెళ్లి కూతురనుకుని స్నేహితుడి మెడలో దండేసిన వరుడు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 09:13 PM

 అందమైన అమ్మాయితో పెళ్లి కాబోతుందని తాగాడో, అలవాటులో పొరపాటుగానే మద్యం సేవించాడో తెలియదు కానీ పెళ్లి రోజు కూడా ఫుల్లుగా తాగొచ్చాడు. వివాహ క్రతువులో భాగంగా అమ్మాయి మెడలో దండ వేయమని పెద్దలు చెప్పగా.. వధువుకు బదులుగా తన స్నేహితుడి మెడలో పూలమాల వేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు వరుడి చెంపలు పగులగొట్టి.. అతడిని చేసుకోనంటూ చెప్పి వెళ్లిపోయింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తపై మనమూ ఓ లుక్కేద్దాం.


ఉత్తర ప్రదేశ్ బరేలీలోని క్లోడియా పోలీస్ స్టేషన్ పరిధిలోగల బర్ఖేడా గ్రామానికి చెందిన 26 రవీంద్ర కుమార్‌కు 21 ఏళ్ల రాధా దేవితో పెళ్లి ఖరారు అయింది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కాగా.. వివాహం కోసం ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 22వ తేదీన వీరి పెళ్లికి మహూర్తం ఖరారు కాగా.. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం 300 మంది వరకు అతిథులకు ఆహ్వానాలు కూడా ఇచ్చారు.


ఈక్రమంలోనే శుక్రవారం రోజు అర్ధరాత్రి సంప్రదాయం ప్రకారం వరుడు రవీంద్ర కుమార్.. వధువు ఇంటికి వచ్చాడు. బరాత్ చేస్తూ తీసుకు రాగా.. రవీంద్ర కుమార్ ఫుల్లుగా మద్యం సేవించాడు. స్నేహితులతో పాటే కలిసి తాగిన ఈయన డ్యాన్సులు చేస్తూ వచ్చాడు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత వరమాల వేయించే కార్యక్రమం జరిగింది. అయితే ఈక్రమంలోనే వరుడు రవీంద్ర కుమార్‌కు పూలమాల ఇచ్చి.. రాధా దేవి మెడలో వేయమని చెప్పారు. కానీ అప్పటికే మందు ఎక్కువై మత్తులో ఉన్న అతడు వధువుకు బదులుగా తన స్నేహితుడి మెడలో దండ వేశాడు.


దీంతో రాధా దేవి తీవ్ర ఆగ్రహానికి గురైంది. పెళ్లి రోజు కూడా ఇంతగా తాగొచ్చిన వాడు నాకొద్దంటూనే అతడి చెంప పగులగొట్టింది. పెళ్లి క్యాన్సిల్ అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోబోయింది. కానీ మధ్యలో కల్గజేసుకున్న వరుడి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు గొడవ చేశారు. ఇలా పెళ్లిరోజు వద్దంటే తమ పరువు పోతుందంటూ అమ్మాయి తరఫు వాళ్లతో గొడవకు దిగారు. ఈక్రమంలోనే పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ నాశనం చేశారు. అప్పటికే అతిథుల కోసం వంటలు చేయగా.. వాటిని కూడా పడేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.


హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసుల ఇరు కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే.. వరుడు రవీంద్ర కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆపై అతడికి వైద్య పరీక్షలు చేయించగా.. అతడు మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే వధువు తరఫు కుటుంబ సభ్యులు వచ్చి.. రవీంద్ర కుమార్, అతడి కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల చట్టం కింద కేసు పెట్టారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూనే.. ఇలా పెళ్లికి ఫుల్లుగా తాగొచ్చారంటూ ఆరోపించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa