ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీకే వార్షికోత్సవ సభ.. ఒకే వేదికపై విజయ్, ప్రశాంత్ కిషోర్‌

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 09:18 PM

విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆవిర్భావ దినోత్సవాన్ని మహాబలిపురంలో నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచి వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ సమర శంఖం పూరించనున్నారు. ఆయనతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా వేదికను పంచుకుంటున్నారు. అంతేకాదు, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామిని కూడా ఆహ్వానించారు. పార్టీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ వేడుకల్లో పార్టీ సర్వసభ్య మండలి, కార్యాచరణ మండలి సమావేశాల తేదీలను కూడా విజయ్‌ ప్రకటించనున్నారు.


ఇటీవలే విజయ్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ అనేక విషయాలపై చర్చించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడానికి అంగీకరించారు. ఆ పార్టీ ప్రత్యేక సలహాదారుడుగా వ్యవహరిస్తానని, తన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తానని విజయ్‌కి పీకే హామీ ఇచ్చారు.


టీవీకే అధినేత ‘GetOut’ హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇటీవల అధికార డీఎంకే #GetOutModi, బీజేపీ #GetOutStalin ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే, విజయ్ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరు ఎత్తకుండానే GetOut క్యాంపెయిన్ చేపట్డం గమనార్హం. రహస్య కూటమి తమిళనాడు ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ టీవీకే ఫ్లెక్సీలను వేయించారు.


విజయ్ రాజకీయ ప్రవేశాన్ని సినిమా రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రులైన ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత వంటి దిగ్గజాలతో పోల్చుతున్నారు. కానీ, శివాజీ గణేశన్, విజయ్‌కాంత్, కమల్ హాసస్ వంటి నటులు రాజకీయాల్లోకి వచ్చినా ప్రభావితం చేయలేకపోయారు. తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ సైతం ఈ విషయంలో వెనుకడుగు వేశారు. అయినప్పటికీ, తానే ప్రత్యామ్నాయం అని విజయ్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలన, శాంతిభద్రతలు, కుటుంబ రాజకీయాలపై తరుచూ విమర్శలు చేస్తున్నారు.


అలాగే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జయలలిత మరణం తర్వాత నాయకత్వ లేమితో సతమతమవుతోన్న అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే జరిగితే అధికార డీఎంకేకు వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ తప్పదు. ఇక, గత ఎన్నికల్లో డీఎంకే వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఈసారి విజయ్ కోసం వ్యూహాలు రచించనున్నారు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు విజయ్‌ను విజయ్ తీరాలకు తీసుకెళ్తాయనేది 2026 వరకూ వేచిచూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa