ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వదిలేస్తే అంతా మునుగుతాం.. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 07:49 PM

టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానన్న చంద్రబాబు.. పార్టీ నిర్మాణంపై నేతలు దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామంటూ గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. పార్టీని నిర్లక్ష్యం చేయవద్దని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.


రాష్ట్రం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నా కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లు సమావేశంలో చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన టీడీఎల్పీ భేటీకి.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రోజు నుంచే కష్టపడి పని చేయాలని సూచించారు. నాయకులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నానన్న చంద్రబాబు.. అందరూ మళ్లీ గెలిచేలా పనిచేయాలని సూచించారు. త్వరలోనే కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతానని.. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపై ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించిన చంద్రబాబు.. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించినట్లు సమాచారం.


ఈ సందర్భంగానే ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. అనవసరమైన విషయాలను మాట్లాడి.. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వొద్దని సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు పొరపాటు మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు, కేడర్‌కు, ప్రజలకు మధ్య సమన్వయం కొరవడిందన్న చంద్రబాబు.. సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను అధిగమించాలని సూచించారు. అలాగే నియోజకవర్గాలలో దెబ్బతిన్న రోడ్లకు రెండు నెలల్లో మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు.


ఇక ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులు పూర్తిగా భర్తీ చేస్తామని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాల బోర్డులలో నియామకాల కోసం పేర్లు ఇవ్వాలని సూచించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో పదవులను మహానాడులోపు పూర్తి చేయాలని నేతలకు స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదన్న చంద్రబాబు.. గ్రూపులు సహించబోనని హెచ్చరించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa