2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రవేశపెట్టింది. రూ.3.22 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో నిలిపివేసిన ఓ కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 2014 నుంచి 2019 వరకూ.. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు తమ పొలంలో భూసారాన్ని పెంచుకునేందుకు, రైతులకు జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తూ వచ్చింది.
2014-19 మధ్య కాలంలో రైతులు దిగుబడి పెంచుకునేందుకు సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలను అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు. రైతుల బాగోగులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే భూసారాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వెట్ కెమిస్ట్రీ విధానం అనుసరిస్తున్నామని, దీని స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతి ఫాలో కానున్నట్లు తెలిపారు.
రైతులకు రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. ఇందుకోసం రూ.240 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ల నిర్వహణ కోసం రూ.40 కోట్లు ప్రతిపాదించారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల రైతు కుటుంబాలతో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి రూ.61.78 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65 కోట్లు, వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ. 250 కోట్లు ప్రతిపాదించారు. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కోసం రూ.9400 కోట్లు, పంటల బీమా పథకానికి రూ.1023 కోట్లు ప్రతిపాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa