సినిమా రంగంలో ఉన్న చాలా మంది రాజకీయాల్లోకి రావడం మన దేశంలో సర్వసాధారణమే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, విలన్లు, ఇతర ఆర్టిస్ట్లు రాజకీయాల్లో అడుగు పెట్టి తమదైన ముద్ర వేశారు. ఆయా రాష్ట్రాల్లో హీరోలు, హీరోయిన్లు సొంతంగా పార్టీలు పెట్టినవారు కూడా ఉన్నారు. ఇక ఈ ట్రెండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సినిమాల్లో బాగా పాపులర్ అయిన వాళ్లు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు కోకొల్లలు. ఇక గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా సినిమా సెలబ్రిటీలు పోటీ చేయగా.. అందులో కొందరు గెలవగా.. మరికొందరు ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా ప్రీతి జింటా రాజకీయ అరంగేట్రం గురించి.. ఆమెకు ఒక ప్రశ్న ఎదురు కాగా.. సమాధానం ఇచ్చారు.
గతంలోనే తనకు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినట్లు బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తాజాగా వెల్లడించారు. అయితే ఆ ఆఫర్ను తాను సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా ప్రీతి జింటా వివరించారు. 2016 ఫిబ్రవరి 29వ తేదీన అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ను పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత బాలీవుడ్కు దూరంగా ఉన్న ప్రీతి జింటా.. బిజినెస్ చూసుకున్నారు. అయితే తాజాగా లాహోర్ 1947 సినిమాతో తిరిగి బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రీతి జింటా పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ఫ్యాన్ అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన ప్రీతి.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. కొన్నేళ్ల క్రితం పలు రాజకీయ పార్టీలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని టిక్కెట్లు కూడా ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో రాజ్యసభకు ఎంపిక చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చాయని తెలిపారు. అయితే సున్నితంగా వాటిని తాను తిరస్కరించినట్లు చెప్పారు. ఎందుకంటే తనకు రాజకీయాలు తెలియదని వెల్లడించారు.
దీనికి కొనసాగింపుగా మరో నెటిజన్ ఇంకో ప్రశ్న అడిగారు. "గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులే మిమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయా" అనే ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు బదులిచ్చిన ప్రీతి జింటా.. దేశంలో సోషల్ మీడియా ఎంత విషపూరితంగా మారిందో ఇలాంటి కామెంట్లను బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకురాలిని కాదని.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. ఒక సాధారణ మహిళగానే ఉంటానని సమాధానం ఇచ్చారు.
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "దిల్ సే" సినిమాతో ప్రీతి జింటా బాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి నటించి తొలి మూవీతోనే మంచి గుర్తింపు పొందారు. ఇక వెంకటేష్ హీరోగా "ప్రేమంటే ఇదేరా" సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్తో కలిసి లాహోర్ 1947 సినిమాలో నటించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాన నిర్మిస్తుండగా.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa