ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2027లోనే మరో కుంభమేళా, ఎక్కడో తెలుసా

national |  Suryaa Desk  | Published : Fri, Feb 28, 2025, 08:15 PM

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా.. ఈ ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద అత్యంత విజయవంతంగా ముగిసింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025.. మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంఖ్య అమెరికా జనాభా 34 కోట్ల కంటే దాదాపుగా రెట్టింపు అని పేర్కొంది. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలోనే తర్వాత వచ్చే కుంభమేళాపై అందరి దృష్టి పడింది. అయితే తర్వాతి కుంభమేళా ఎక్కడ జరుగుతుంది. ఎన్ని రోజులు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు అందర్లో చర్చకు దారి తీస్తున్నాయి.


తర్వాతి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ?


ఇక తదుపరి కుంభమేళా 2027లో జరగనుంది. మహారాష్ట్రలోని నాసిక్‌ త్రయంబకేశ్వర్ వద్ద ఈ కుంభమేళాను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. నాసిక్ పట్టణానికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ కుంభమేళా జరగనుంది. దేశంలోనే రెండో అతి పొడవైన నది అయిన గోదావరి నది ఇక్కడే జన్మిస్తుంది. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ శివాలయం ఇక్కడ ఉంటుంది. ఇక అక్కడ జరిగే కుంభమేళాను 2027 జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


 టెక్నాలజీతో వర్చువల్‌గా కుంభమేళా స్నానం


2027 నాసిక్ కుంభమేళాలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తామని.. ముంబైలో జరిగిన నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం 2025లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా పవిత్ర జలాల్లో స్నానం చేయలేని వారు.. ఆ అనుభూతిని వర్చువల్‌గా పొందడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.


3 ఏళ్ల వ్యవధిలోనే కుంభమేళా ఎందుకు?


సాధారణంగా కుంభమేళాను మన దేశంలోని 4 నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో జరుపుతారు. అయితే కనీసం 3 ఏళ్ల వ్యవధిలో ఈ కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతీ 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని కుంభమేళా అంటారు. అదే ప్రతీ 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు. ఇక ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది పూర్ణ కుంభమేళాగా పరిగణిస్తారు. ఇక ఇటీవల ముగిసిన కుంభమేళా 144 ఏళ్ల తర్వాత నిర్వహించారు. అందుకే దీన్ని మహా కుంభమేళాగా అభివర్ణిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa