ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"డబ్బు కాదు.. టాలెంట్ ముఖ్యం".. గోపీచంద్‌కు పీవీ సింధు తండ్రి కౌంటర్

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:05 PM

ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు క్రీడల్లో రాణించాలని పీవీ సింధు తండ్రి రమణ అభిప్రాయపడ్డారు. మాజీ వాలీబాల్ క్రీడాకారుడైన పీవీ రమణ ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలు మధ్య తరగతి కుటుంబాల గురించి ప్రస్తావించారు. అదే సమయంలో గతంలో పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ డబ్బు కన్నా టాలెంట్ ముఖ్యమని చెప్పారు.


ఆసియా వాలీబాల్ గేమ్స్‌లో భారత్‌కి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన పీవీ రమణ తన జీవిత అనుభవాలు, సింధు కెరీర్ గురించిన పలు విషయాలు పంచుకున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో పిల్లలు క్రీడల్లో రాణిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని.. తనకు కూడా అలానే రైల్వే జాబ్ వచ్చిందని చెప్పారు. తనకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మరణించాడని, పది మంది సంతానంలో అందరి కంటే చిన్నవాడినైన తనను క్రీడల వైపు ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.


జాతీయ స్థాయి వాలీబాల్‌లో ప్రతిభ చాటి ఇవాళ తన కూతురిని కూడా క్రీడలవైపు రాణించేలా చేశానని తెలిపారు. దిగువ, మధ్య తరగతి కుటుంబాలు క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అయితే ఇటీవల భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలకు పీవీ సింధు తండ్రి కౌంటర్ ఇచ్చారు. ధనవంతుల పిల్లలు మాత్రమే క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని గోపీచంద్ అన్నారు. దానిపై రమణ పరోక్షంగా స్పందిస్తూ ప్రతిభకు డబ్బుతో సంబంధం లేదని.. టాలెంట్ ఉంటే చాలు అంటూ కౌంటర్ ఇచ్చారు.


"నా పెద్ద కుమార్తె దివ్య చిన్నతనంలో నెట్‌బాల్‌ని బాగా ఆడేది.. ఆ తర్వాత తాను డాక్టర్ అయింది. సింధు బ్యాడ్మింటన్‌లో తన ప్రతిభ చూపెట్టింది. పిల్లల ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలి. పెద్ద కుమార్తెకు చదువుపై ఉంది అటువైపు ప్రోత్సహించా.. సింధుకి బ్యాడ్మింటన్‌లో ప్రతిభ ఉంది అందుకే స్పోర్ట్స్‌లో వెళ్లింది. పదో తరగతి చదివే సమయంలోనే సింధు మంచి ఫామ్‌లో ఉంది.. ఆమెకు స్పాన్సర్లు కూడా దొరికారు" అని రమణ పీటీఐతో అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa