ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరు పరిధిలో త్రాగునీటి సమస్యని పరిష్కరిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 09:26 AM

పర్చూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. జల జీవన్‌ మిషన్‌ పథకం కింద పర్చూరు నియోజకవర్గంలోని 81 పనులకు రూ.36.55 కోట్లు మంజూరైనట్లు ఆదివారం ప్రకటనలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో రక్షిత తాగునీటి సరఫరా, ఆర్వో ప్లాంట్ల నిర్మాణం, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణం, పైపు లైన్‌ నిర్మాణం, ఇంటింటికీ కొళాయి ఏర్పాటు తదితర పనులకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. సీఎం చంద్రబాబు సహకారంతో కోట్లాది రూపాయల నిధులు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నగం జాం మండలానికి 27 వర్కులకు రూ.8.19 కోట్లు, మార్టూరు మండలానికి నాలుగు వర్కులకు రూ.2.30కోట్లు, ఇంకొల్లు మండలానికి 15 వర్కులకు రూ.4.21కోట్లు, కారంచేడు మండలానికి 16 వర్కులకు రూ.9.68కోట్లు, పర్చూరు మండలానికి 13 పనులకు గాను రూ.7.34కోట్లు, యద్దనపూడి మండలానికి 6 వర్కులకు రూ.4.84కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గత వైసీపీ హయాంలో తాగునీటి ప్రాజెక్టులు అస్తవ్యస్తంగా మారాయన్నారు. ఫిల్టర్‌ బెడ్‌లు మరమ్మతులకు కూడా నోచుకేలేన్నారు. దీంతో కలుషిత నీటిని ప్రజలు తాగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలన లో జలజీవన్‌ మిషన్‌కు జీవం లేకుండా చేశారన్నారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆ ప్రకటనలో ఏలూరి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa