తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల అన్నప్రసాదంలోకి కొత్తగా మరో వంటకం వచ్చి చేరబోతోంది. తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడలు కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మార్చి 6వ తేదీ నుంచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వడలు కూడా వడ్డించనున్నట్లు తెలిసింది, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు అన్పప్రసాదంలో వడలు వడ్డించే విషయమై ఇప్పటికే ఓసారి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ట్రయల్ రన్లో భాగంగా జనవరి నెలలో సుమారుగా ఐదు వేల మంది భక్తులకు వడలు వడ్డించారు.
అన్నప్రసాదం మెనూలో మరో ఐటమ్ పెంచాలని టీటీడీ పాలకమండలి కొత్తగా నియామకమైన సమయంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు అన్నప్రసాదం మెనూలోకి వడలను చేర్చనున్నారు. ట్రయల్ రన్లో భాగంగా జనవరిలో 50 వేల మంది భక్తులకు ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా తయారు చేసిన మసాలా వడలు వడ్డించారు. వడల రుచిపై భక్తుల నుంచి టీటీడీ సిబ్బంది అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వడల రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయటంతో.. వీటిని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా వడలను తయారుచేసేందుకు అవసరమైన సిబ్బంది కొరతగా ఉన్నట్లు తెలిసింది. అయితే లోటుపాట్లను సరిచేసుకుని మార్చి ఆరో తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం.
మరోవైపు టీటీడీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. తిరుమలలో మంచి నీటి కోసం సీసాలను ఉపయోగిస్తున్నారు. అయితే సీసాల స్థానంలో కొత్తగా టెట్రా ప్యాకెట్లు అందుబాటులోకి తేవాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సోమవారం తిరుమల శ్రీవారిని 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,453 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీకి 3.74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆరు కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa