ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:09 PM

నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కలవటాల దాటగానే ప్రమాదానికి గురైంది. కలవటాల వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన డ్రైవర్ ఓ చేయి స్టీరింగ్ మీద, మరో చేతితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తాపడింది.


బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో అందులోని ప్రయాణికులు భయపడిపోయారు. బస్సు ముందు భాగంలోని అద్దాలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. గాయపడిన వారి అరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆరా తీశారు. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులను వివరణ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa