ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతో వైరం నిజమే.. దగ్గుబాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 05:52 PM

విశాఖపట్నం వేదికగా జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేదికపై తోడల్లుళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై వచ్చారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుబాటిని అభినందిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటిలు ఒకే వేదికపై కనిపించారు.. కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబుకు తనకూ వైరం ఉందని అంటుంటారని.. వైరం ఉన్నమాట నిజమే అన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 'కాలంతో పాటు మనం మారాలి.. నాకు మళ్లీ రాజకీయ కోరికలు లేవు.. మళ్లీ అలాంటి కోరికలు ఉన్నాయని అనుకుంటారేమో. ఇది వరకు చంద్రబాబు గురుంచి పుస్తకం రాసుండొచ్చు.. అదంతా గతం , అదంతా వదిలేస్తాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు' అన్నారు. చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలనపై వివరాలను సేకరించి ప్రపంచ చరిత్రను రాశానన్నారు.


తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని.. ఎంబీబీఎస్ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్‌ స్టడీస్‌పై పరిజ్ఞానం తనకు అంతగా లేదన్నారు. అసలు చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలో ఆలోచించానని.. ఎక్కడ పుస్తకాలు కనిపించినా కొనుగోలు చేసేవాడిని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు చరిత్ర గురించి తెలుసుకున్నానని.. అలాగే ప్రపంచ చరిత్ర రాయాలంటే అనేక విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు.


ఎవరూ చేయనటువంటి సాహసాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేశారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచతత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ప్రశంసించారు. ఆయన పుస్తకం రాస్తారని తాను అనుకోలేదని.. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు తోడల్లుడు.. ఎన్టీఆర్‌ దగ్గర ఇద్దరం కలిసి అన్నీ నేర్చుకున్నామన్నారు. అలాగే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి చొరవను చూశామని.. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు ఆ చొరవ ఉపయోగపడింది అన్నారు చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa