ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. ఇక వారికి అమెరికాలోకి నో ఎంట్రీ, వారిపై ట్రావెల్ బ్యాన్

international |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 08:00 PM

 అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. సంచలన ఉత్తర్వులపై సంతకాలు చేస్తూ.. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలతో అటు అమెరికన్లతోపాటు ప్రపంచ దేశాల ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర అప్రమత్తంగా ఉంటున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఏం బాంబు పేల్చుతారో అని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాను మళ్లీ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలని పట్టుదలగా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయానికి సమాయత్తం అవుతున్నారు. పాకిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారిని అడ్డుకోవాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.


పాకిస్తానీయులు, ఆఫ్గనిస్థాన్ వాసులపై త్వరలోనే అమెరికా ప్రభుత్వం ట్రావెల్‌ బ్యాన్‌ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయం వచ్చే వారమే అమల్లోకి రానున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇలాంటి నిర్ణయం ట్రంప్ తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. కొన్ని ముస్లిం దేశాలకు చెందిన ప్రజలను అమెరికాలోకి ప్రవేశించడపై బ్యాన్ విధించారు. ఇక దీనిపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. అనేక పరిశీలన తర్వాత 2018లో కోర్టు కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సమర్థించింది. అయితే ఆ తర్వాత 2020లో అమెరికాలో అధికారంలోకి వచ్చిన జో బైడెన్‌.. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి.. ఆయా దేశాలకు చెందినవారికి అమెరికాలోకి ప్రవేశం కల్పించింది.


అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌.. అనేక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వీటిలో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను నుంచి దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందా అనేది ముందే గుర్తించే ఆదేశాలపై సంతకం చేశారు. దీని ప్రకారం.. తాత్కాలికంగా లేదా పూర్తిగా ట్రావెల్ బ్యాన్ విధించాల్సిన దేశాల లిస్ట్‌ను రూపొందించి మార్చి 12వ తేదీలోగా సమర్పించాలని కేబినెట్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో పాకిస్తాన్, అఫ్గానిస్థాన్‌ దేశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


అఫ్గానిస్తాన్‌లో దాదాపు 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఉంది. అయితే 2021లో అమెరికా సైన్యాన్ని జో బైడెన్ వెనక్కి తీసుకువచ్చారు. ఆ 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం కోసం పనిచేసిన ఆఫ్గన్లపై తాలిబన్లు ప్రతీకారం తీర్చుకుంటారనే భయం ఇప్పటికే స్థానికుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే వేలాది మంది అఫ్గాన్‌ పౌరులు అమెరికాలో శరణార్థులుగా లేదా ప్రత్యేక వలసవాదుల కింద వీసాలు పొందారు. అయితే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకుని ఒకవేళ నిషేధం అమల్లోకి వస్తే వారందరిపై తీవ్ర ప్రభావం పడనుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa