ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. డ్వాక్రా సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన చంద్రబాబు.. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం ఏపీ పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలాగే పలువురు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.
గతంలో అధిక సంతానం వద్దని చెప్పానన్న చంద్రబాబు.. ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా పిల్లలను కనాలని చెప్తున్నానని అన్నారు. ఉత్తర భారత దేశంలో ఒక్కో జంట ముగ్గురు సంతానాన్ని కలిగి ఉంటారన్న చంద్రబాబు.. దక్షిణ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇక్కడి ప్రజలు తక్కువన మంది సంతానాన్ని కలిగి ఉంటారని.. కొందరైతే ఏకంగా పిల్లలను కనడానికి కూడా ఇష్టపడటం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పిల్లలను కనకపోతే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవన్న చంద్రబాబు.. దంపతులు పిల్లలను కనాలని సూచించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవులు ఇస్తుండగా.. ఇప్పటి నుంచి ఎంతమందిని పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వీటితో పాటుగా ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తామని తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 180 రోజుల పాటు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇద్దరు సంతానం వరకూ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తున్నాయి. అయితే దేశ అవసరాల కోసం ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa