ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. టికెట్ కన్ఫర్మ్ కాకుంటే స్టేషన్‌లోకి నో ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 07:40 PM

ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కీలక రైల్వే స్టేషన్లలో పండగలు, సెలవుల సమయంలో ఉండే రద్దీ సాధారణంగా ఉండదు. దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేల ద్వారానే నిత్యం కోట్లాదిమంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్లలో రద్దీ కారణంగా.. ప్రమాదాలు చోటు చేసుకుంటుండంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. రైల్వే స్టేషన్లలో రద్దీని కట్టడి చేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించనున్నారు.


ఈ నిర్ణయాన్ని మొట్టమొదటగా దేశంలోని 60 అతిపెద్ద రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు వారి భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సహా దేశంలోని పలు ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి. పండగలు, సెలవుల సమయంలో ప్రయాణికులు ఎంత మంది ఉంటున్నారో వారిని దింపడానికి, తీసుకెళ్లడానికి చాలా మంది రైల్వే స్టేషన్లకు వస్తూ ఉంటారు. దీని వల్ల రైల్వే స్టేషన్లలో ప్రయాణికులతోపాటు వారి బంధువులతో తీవ్ర రద్దీ నెలకొంటోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల అలాంటి అనవసర రద్దీ తగ్గనుంది.


తాజాగా తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ఇలా బంధువులు, టికెట్లు కన్ఫర్మ్ కాని వారిని రైల్వే స్టేషన్‌‌లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దేశంలోని 60 అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. ఈ 60 స్టేషన్ల జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్, హౌరా జంక్షన్, చెన్నై సెంట్రల్, బెంగళూర్ సిటీ రైల్వే స్టేషన్ ఉన్నాయి. ప్రయాణికుల రద్దీని నియంత్రించడం కోసం అవసరాలను బట్టి మరిన్ని స్టేషన్లను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు.


అయితే ఈ 60 స్టేషన్లలోకి వచ్చే ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కి వచ్చే సమయంలోనే టికెట్ కన్ఫామ్ అయినట్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు. ఈ కొత్త విధానం రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికుల రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


రైల్వే శాఖ ఉన్నతాధికారులతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ 60 రైల్వే స్టేషన్ల పరిసరాల్లో కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక పెద్ద రైల్వే స్టేషన్లలో వార్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో అధికారులు సమన్వయం చేసుకోవడానికి ఈ వార్ రూమ్‌లు ఉపయోగపడనున్నాయి. మరోవైపు.. సర్వీస్ స్టాఫ్‌ని సులభంగా గుర్తించేందుకు కొత్త యూనిఫాంను కూడా రైల్వే శాఖ అందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa