ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్ నుంచి భారత్‌కు ఎంత గోల్డ్ తీసుకురావచ్చు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:48 PM

కన్నడ నటి రన్యారావు.. దుబాయ్ నుంచి 15 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్-డీఆర్ఐ అధికారులకు చిక్కింది. అయితే తీగ లాగితే డొంకంతా కదిలినట్లు రన్యారావు అరెస్ట్‌తో ఆమె గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ మొత్తం బయటికి వచ్చింది. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి బంగారాన్ని ఎంత మొత్తంలో మన దేశానికి తీసుకువచ్చే వీలు ఉంటుంది. మరీ ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చేవారు.. అధికారులకు చిక్కకుండా చట్టబద్ధంగా ఎంత బంగారాన్ని తీసుకురావాలి అనే వాటిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలా విదేశాల నుంచి బంగారాన్ని తీసుకురావాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మన దేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి.. పనిచేసే వారు వస్తూ వస్తూ.. తమతో కొంత బంగారాన్ని తీసుకువస్తూ ఉంటారు. అయితే బంగారం అక్రమ రవాణాను అడ్డుకునే కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారిని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే బయటికి పంపిస్తారు. అలాంటి వారు చాలా మంది భారత్‌లోని పలు ఎయిర్‌పోర్టుల్లో బంగారాన్ని మోతాదుకు మించి తీసుకువస్తూ దొరికిపోతూ ఉంటారు. దీంతో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తూ ఉంటారు.


అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి బంగారాన్ని తీసుకురావడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్-సీబీఐసీ రూపొందించాల్సిన కొన్ని నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకుంటే అధికారులు అరెస్ట్ చేస్తారు. విదేశాల నుంచి భారత్‌కు బంగారాన్ని తీసుకురావాలంటే.. ఆ బంగారానికి దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ ప్రస్తుతం 6 శాతం ఉంది. అయితే ఈ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను కట్టకుండా తప్పించుకునేందుకు చాలామంది బంగారాన్ని బట్టల్లో, ఇతర వస్తువుల్లో దాచి తరలిస్తూ అధికారులకు పట్టుబడుతూ ఉంటారు.


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకారం.. 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం దుబాయ్‌లో 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండి.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించినవారు.. తమతోపాటు ఒక కిలో బంగారాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అంతకంటే ఎక్కువ బంగారం తీసుకురావాలనుంటే మాత్రం.. అది ట్యాక్స్ చెల్లించిన బంగారం అని చూపించాల్సి ఉంటుంది. లేకుంటే ఎయిర్‌పోర్టు తనిఖీల్లో పట్టుబడిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.


అయితే ఇలా కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా కూడా విదేశాల నుంచి బంగారాన్ని తక్కువ మొత్తంలో తీసుకువచ్చే వెసులుబాటు ఉంటుంది. పురుషులు 20 గ్రాములు.. మహిళలు 40 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా తెచ్చుకోవచ్చు. అయితే అలాంటి బంగారం.. గోల్డ్ బార్లు, కాయిన్స్ రూపంలో మాత్రమే ఉండాలి. అయితే 15 ఏళ్లలోపు పిల్లలు మాత్రం 40 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చిన్న పిల్లల కోసం కొనుగోలు చేసే బంగారం.. నగలు, బహుమతుల రూపంలో ఉండాలి. ఇక ప్రయాణ సమయంలో కస్టమ్స్ డ్యూటీ వెరిఫికేషన్ సమయం.. బంగారం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. పిల్లలకు తల్లితండ్రులకు సంబంధించిన ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa