ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న ఔరంగజేబును పొగిడి.. నేడు శంభాజీ మహారాజ్‌కు నివాళి

national |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:51 PM

మొఘల్ పాలకుడు ఔరంగాజేబ్‌ను ప్రశంసించినందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీపై.. తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ నాయకులు అందరూ దీనిపై స్పందిస్తూ.. అబూ అజ్మీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అసలు చరిత్రే తెలియదంటూ నిప్పులు చెరిగారు. దీంతో తన మాటలను సమర్థించుకునే ప్రయత్నం చేసిన ఆయన తాజాగా తీరు మార్చుకున్నారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ వర్ధింతి సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ.. నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆయన గురించి అనేక మంచి విషయాలు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆపూర్తి వివరాలు మీకోసం.


మార్చి 3వ తేదీ సోమవారం రోజు సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు, ముంబయి ఎమ్మెల్యే అబూ అజ్మీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగాజేబ్ క్రూరుడు కాదని చెప్పారు. ఆయన కూడా అనేక ఆలయాలను కట్టించారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఈ కామెంట్లు నెట్టింట వైరల్ కాగా.. బీజేపీ తీవ్రంగా స్పందించింది. దాదాపుగా అందరు నాయకులు దీని గురించి మాట్లాడుతూ.. అబూ అజ్మీపై నిప్పులు చెరిగారు. అసలు ఆయనకు చరిత్రే తెలియదని.. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విమర్శించారు.


కేవలం బీజేపీ నాయకులు మాత్రమే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రజలు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే మహారాష్ట్ర సర్కారు దీనిపై స్పందించి.. మార్చి 26వ తేదీ వరకు ఆయనను సస్పెండ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పింది. దీంతో అబూ అజ్మీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ఔరంగాజేబుకు బదులుగా ప్రస్తుతం.. ఛత్రపతి శివాజీ, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు.


ముఖ్యంగా ఈరోజు శంభాజీ మహారాజ్ వర్ధంతి కాగా.. అబూ అజ్మీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులోనే ఆయన ఫొటో పెట్టి నివాళులు అర్పించారు. ఆపై శంభాజీ మహారాజ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. పోర్చుగీసులు, మెఘలులకు వ్యతిరేకంగా సైన్యాలను ముందుకు నడిపంచారని చెప్పారు. చివరకు శత్రువులకు చిక్కి సంగమేశ్వర్ దగ్గర హత్యకు గురయ్యారని.. ఆయన్ను చిత్ర హింసలు పెట్టి చంపేశారని గుర్తు చేశారు.


అంతేకాకుండా సామ్రాజ్యానికి రెండో ఛత్రపతి.. శంభాజీ మహారాజ్ అంటూ పరాక్రమవంతుడైన యుద్ధ వీరుడు అని అబూ అజ్మీ వ్యాఖ్యానించారు. అలాగే ధర్మవీర్ శంభాజీ మహారాజ్‌కు తన ఘన నివాళులు అంటూ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇలా వారం రోజుల్లోనే మాట మార్చిన ఈయన తీరుతో అంతా షాక్ అవుతున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఈయనకు బుద్ధి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com