ప్రస్తుతమంతా సెల్ఫోన్ యుగం.. అంతా ఆన్లైన్ మయం.. సందు చివర టీకొట్టు నుంచి సెంటర్లోని షాపింగ్ మాల్ వరకూ అంతా డిజిటల్ చెల్లింపుల వ్యవహారం. జేబులో నోటు లేకపోయినా పర్లేదు, చేతిలో సెల్లు, అందులో ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ ఆధారంగా పనిచేసే యాప్లు ఉంటే చాలు. దేశం మొత్తం చుట్టేయొచ్చు. అయితే ఆగంతకులకు ఇలాంటి చెల్లింపులు చేసేటప్పుడు బీకేర్ ఫుల్.. ఎందుకంటే ఇలాంటి ఫోన్పే పంచాయతీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కు చేర్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లాలో ఫోన్పే పేరుతో ఓ వ్యక్తి మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరులో ఓ మెడికల్ షాపు ఉంది. ఆ మెడికల్ షాప్ ఓనర్ వద్దకు ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి వెళ్లాడు. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని.. మీ వద్ద నగదు ఉంటే ఇవ్వండి, తాను ఫోన్పే చేయిస్తానని నమ్మబలికాడు. దీనికి తోడు తనకు 49 వేల 500 రూపాయలు నగదు రూపంలో ఇస్తే.. మీ బ్యాంక్ ఖాతాకు రూ.50000 ఫోన్పే చేయిస్తానని ఆశచూపాడు. దీంతో ఆ షాపు ఓనర్ ఆశకుపోయాడు. అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మెడికల్ షాపు ఓనర్ మొబైల్ ఫోన్కు ఫోన్పే ద్వారా అకౌంట్లో రూ.50 వేలు జమైందంటూ మెసేజ్ వచ్చింది.
తన డబ్బులు తనకు వచ్చాయనే నమ్మకంతో మెడికల్ షాపు యజమాని.. ఆ కొత్త వ్యక్తికి రూ.49,500 ఇచ్చి పంపాడు. అయితే కాసేపటికే ఊహించని ట్విస్ట్ జరిగింది. మందులషాపు అతనికి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను పొరపాటున మీకు రూ.50 వేలు ఫోన్పే చేశానని, తన డబ్బు వాపస్ చేయాలంటూ అవతలి వ్యక్తి కోరాడు. దీంతో మెడికల్ షాప్ యజమాని షాక్ తిన్నాడు. జరిగిన విషయం మొత్తం అవతలి వ్యక్తికి చెప్పాడు. అయితే ఆ కొత్త వ్యక్తి ఎవరో తనకు తెలియదన్న కర్నూలు వాసి.. తాను పంపిన డబ్బులు వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశాడు.
అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కర్నూలు టూటౌన్ పోలీసుల వద్దకు చేరింది. ఇద్దరినీ పిలిపించి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ కొత్త వ్యక్తి ఎవరు.. అతని చెప్పిన కాసేపటికే, కర్నూలు వ్యక్తి ఫోన్పే నుంచి డబ్బులు ఎలా వచ్చాయి.. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా ప్రీప్లానా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa