హైదరాబాద్లోని టోలిచౌకి సమతాకాలనీకి చెందిన ఓ వివాహిత (32).. ప్రైవేటు స్కూల్కు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అయితే.. తన భర్త కొన్నేళ్లుగా దుబాయ్లో పనిచేస్తున్నాడు. అయితే.. స్కూల్ ప్రిన్సిపల్ కావటంతో.. తమ పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు, అప్డేట్స్ గురించి తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది ఆ వివాహిత. ఈ క్రమంలోనే.. గతేడాది తమ స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటనను కూడా ఇన్స్ట్రాగాంలో పోస్ట్ చేసింది. అయితే.. అప్పటికే ఆమె ఖాతాను ఫాలో అవుతున్న షేక్ వసీం అనే యువకుడు.. తనకు ఓ అడ్మిషన్ కావాలంటూ మెస్సేజ్ చేసి, ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. ఫోన్ చేసి.. అడ్మిషన్ విషయాలతో మొదలుపెట్టి రకరకాల విషయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు.
యువకుడి వంకర మాటలు అర్థం చేసుకున్న ప్రిన్సిపల్.. కాల్ కట్ చేసింది. అక్కడితో ఆగకుండా.. వసీం ఆమెకు తరచూ ఫోన్ చేస్తుండడంతో అతని ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టేసింది. దీంతో.. వసీం మరో అడుగు ముందుకేశాడు. ఆమె స్కూల్కు వెళ్లి అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి ఆ మహిళ పర్సనల్ నెంబర్ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్కు.. ఆమె ఇంటికి తిరుగుతూ.. రకరకాల నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ, మెసేజ్లు పెడుతూ వేధించటం మొదలుపెట్టాడు. దీంతో.. తెలిసిన నెంబర్లు తప్ప మిగతా ఏ నెంబర్లు కూడా ఎత్తటం ఆపేసింది.
దీంతో.. వసీం ఆమెతో మాట్లాడేందుకు కొత్త ఐడియా ఆలోచించాడు. ర్యాపిడో డ్రైవర్ను బుక్ చేసుకుని ఆమె ఇంటికి పంపించి పార్శిల్ ఇస్తారు.. తీసుకురా అని పంపించేవాడు. తీరా.. ఆమె ఇంటికి వెళ్లి పార్శిల్ గురించి అడిగితే.. తమకేమీ తెలియదని చెప్తుండటంతో వసీంకు ర్యాపిడో డ్రైవర్ ఫోన్ చేసేవాడు. దీంతో.. ఫోన్ ఆమెకు ఇవ్వు మాట్లాడతానంటూ.. తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇలా.. గత 7 నెలలుగా వసీం నుంచి ప్రిన్సిపల్కు రకరకాలుగా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నాడు. ఓ స్కూల్ ప్రిన్సిపల్ కావటంతో.. ఈ విషయం బయటికి వస్తే ఎక్కడ తమ పాఠశాల పేరు దెబ్బతింటుందోనని ఆలోచించి.. ఆమె వసీంకు అన్ని రకాలుగా చెప్పి చూసింది. కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే వసీంలో ఎలాంటి మార్పు రాలేదు.
అయితే.. రెండు రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన వసీం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆమెను, ఆమె పిల్లలను కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్లు పెట్టాడు. అసలే భర్త తనతో లేడు.. ఇలాంటి సమయంలో కిడ్నాప్ చేస్తానంటూ వసీం నుంచి బెదిరింపులు రావటంతో... భయాందోళనకు గురైన బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa