ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లాడికి తినిపించే విషయంలో గొడవ.. భార్యపై కోపంతో భర్త దారుణం

Crime |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:19 PM

రెండేళ్ల కిందే పెళ్లయింది. ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఆరు నెలల కిందటే పండంటి బిడ్డ జన్మించాడు. మొన్నటి వరకు అమ్మగారింట్లోనే ఉన్న ఆ తల్లీబిడ్డలు.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. అయితే.. ఆ బుడ్డోడికి సపర్యలు చేయటం తల్లికి కాస్త కష్టమైన విషయమే. అందులోనూ మొదటి బిడ్డ కావటంతో.. ఇంకొంచెం ఎక్కువ కష్టం. అందులోనూ స్నానం చేపించటం, అన్నం తినిపించటమనేది పెద్ద టాస్క్. బుడ్డోడికి అన్నం తినిపించటం దగ్గరే.. భార్యాభర్తలకు గొడవ జరిగింది. ఎవరు ఏమనుకున్నారో కానీ.. భార్యపై కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. క్షణికావేశంలో బలవంతంగా ప్రాణాలు తీసుకుని.. ఆ బుడ్డోడి ఇంత చిన్న వయసులోనే నాన్నలేని వాడిగా మిగిల్చి.. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపాడు.


ఏపీలోని నంద్యాలకు చెందిన నర్సింహా రెడ్డి(28), విష్ణుప్రియలకు 2023లో వివాహం జరిగింది. వీళ్లు.. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదిత్యనగర్ కృష్ణ కాలనీలో నివాసముంటున్నారు. నర్సింహా రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. ఇద్దరు దంపతులకు ప్రస్తుతం ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. ఇన్ని రోజులు బుడ్డోడితో హ్యాపీగానే సాగిపోతుండగా.. ఆదివారం (మార్చి 9న) రోజున సాయంత్రం వారింట్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది.


బుడ్డోడికి అన్నం తినిపించే విషయంలో.. భార్యాభర్తలిద్ద మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. మాటా మాటా అనుకున్నారు. అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో భార్య అన్న మాటలు తనను బాధపెట్టటంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన నరసింహా రెడ్డి.. గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. పిల్లాడిని చూసుకుంటూ ఉన్న భార్య కూడా.. కోపం తగ్గిన తర్వాత అతనే వస్తాడనుకుని సైలెంట్‌గా ఉండిపోయింది. కానీ.. నరసింహా రెడ్డి ఎంతసేపటికి బయటికి రాకపోవటంతో.. భార్య విష్ణుప్రియకు అనుమానం వచ్చి భర్తను ఎంత పిలిచినా పలకలేదు. దీంతో.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన స్థానికులు.. గది తలుపులు బద్దలు కొట్టారు.


గదిలోకి వెళ్లి చూడగా.. నరసింహా రెడ్డి ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. నరసింహా రెడ్డిని కిందకు దించి పరిశీలించి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచినట్టు గుర్తించారు. స్థానికులు వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముషీరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa