ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్.. రైలులో 400 మంది ప్రయాణికులు

international |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:18 PM

పాకిస్తాన్‌లో వేర్పాటువాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలోనే వందల మంది ప్రయాణిస్తున్న రైలును.. వేర్పాటువాదులు హైజాక్ చేశారు. 400 మందికిపైగా ప్రయాణికులు, 9 బోగీలతో ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను వేర్పాటువాదులు పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరం నుంచి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ నగరానికి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేయడం ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారింది.


బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ.. ఈ ట్రైన్ హైజాక్‌కు పాల్పడింది. అయితే ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసినట్లు స్వయంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తాము జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను తమ అధీనంలోకి తీసుకున్నామని.. అందులో ఉన్న ప్రయాణికులను బంధీలుగా చేసుకున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.


అయితే ఈ ఘటనలో ఆరుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు పాక్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు జరిపి.. అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ సందర్భంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి జీయాంద్ బలోచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా పాకిస్తాన్ దళాలు ఏదైనా చర్యకు పాల్పడితే.. రైలులో ఉన్న ప్రయాణికులు అందర్నీ చంపేస్తామని హెచ్చరించారు. ఇక రైలును హైజాక్ చేసేందుకు.. రైలు పట్టాలను బాంబులతో పేల్చి వేసిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ సైనికులు.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఆగిన తర్వాత అందులోకి వెళ్లి హైజాక్ చేశారు.


బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని బోలాన్ జిల్లా ముష్కాఫ్ ప్రాంతంలో ఈ ట్రైన్ హైజాక్ జరగ్గా.. భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో బలూచిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయి ఎమర్జెన్సీ విధించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని సంస్థలను సమీకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు.


బలూచిస్తాన్‌లోని ఖనిజ సంపదపై చైనా కన్నేయడంతో దాన్ని అడ్డుకునేందుకు బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక ఆ రెబల్ గ్రూప్స్ అన్నింటిలో ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అతిపెద్దది కాగా.. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను అన్యాయంగా దోపిడీ చేస్తున్నారని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది.


మరోవైపు.. బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్థాన్‌లోని అన్ని ప్రావిన్సుల కంటే పెద్దది. పాకిస్తాన్ దేశ మొత్తం విస్తీర్ణంలో ఒక్క బలూచిస్తాన్ ప్రావిన్స్ 44 శాతం ఉంటుంది. అయితే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే అతి తక్కువ మంది జనాభా నివసిస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన సముద్ర ఓడరేవు అయిన గ్వాదర్ పోర్టు ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోనే ఉంది. ఈ గ్వాదర్ పోర్టు.. స్థానిక, అంతర్జాతీయ వ్యాపారానికి పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa