అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే అయిదేళ్లలో ప్రపంచమంతా మనవైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేశ్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టమైన విద్యాశాఖను కోరుకున్నానని, కేజీ టు పీజీ ప్రక్షాళన చేయాలని భావించానని అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 9నుంచి 3కు, క్విఎస్ టాప్ -100 ర్యాంకింగ్స్ లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు. విద్యామంత్రి అయ్యాక ఈ శాఖలో దారుణమైన పరిస్థితులను చూశానని, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 12 లక్షలమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు సంబంధించి అనేక మాటలు చెప్పిందని, కానీ చేతల్లో అంతా డొల్లతనమేనని అన్నారు. జీవో 117పై ఇటీవల వర్క్ షాపు పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల 10మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 5507కు, 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 13,720కి పెరిగినట్లు చెప్పారు. సింగిల్ టీచర్ స్కూల్స్ 30 శాతం అంటే 12,512కు పెరిగాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డ్రాపవుట్ రేట్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 12.5 శాతానికి వెళ్లాయని, రాష్ట్రవ్యాప్తంగా 7 నుంచి 8వ తరగతికి 47 వేల మంది ఆడపిల్లలు విద్యకు దూరమైనట్లు చెప్పారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అధికారులను అడిగితే వారాలు, నెలల తర్వాత 33.40లక్షల మంది ఉన్నారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. డ్రాప్ బాక్సు విధానం వల్ల సరైన సంఖ్య చెప్పలేదని, 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన దాదాపు లక్ష మంది పిల్లలు డ్రాప్ బాక్సులో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా గ్రాస్ రోల్మెంట్ రేషియో ఎక్కువగా చూపేందుకు ఇలా చేశారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa