ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు.. కాల్పుల విరమణకు ఒకే చెప్పిన కీవ్

international |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 08:07 PM

మూడేళ్లకుపైగా కొనసాగుతోన్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు కీవ్ అంగీకరించింది. అమెరికా  ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఉక్రెయిన్.. రష్యాతో తక్షణమే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరుపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.


ఇటీవల వైట్‌హౌస్‌‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చల్లో వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జెలెన్‌స్కీ అర్ధాంతరంగా అమెరికా నుంచి వెనుదిరిగారు. దీంతో ఉక్రెయిన్‌‌లో ఖనిజాల తవ్వకాల ఒప్పందం ఎటూ తేలకుండా పోయింది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ పరిణామాలతో ఖంగుతిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ట్రంప్‌తో చర్చల సందర్బంగా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటించారు.


దీంతో సౌదీ యువరాజు ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఆధ్వర్యంలో సానుకూల వాతావరణంలో అమెరికా, ఉక్రెయిన్‌లు చర్చలు జరిపాయి. 30 రోజుల పాటు సాధారణ కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ అంగీకరించగా... సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి కీవ్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. చివరిగా ఖనిజాల తవ్వకానికి సంబంధించి వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. అలాగే, ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు అమెరికా వివరించనుంది.


ఉక్రెయిన్‌తో చర్చల్లో అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం మార్క్ రూబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని రష్యాకు వివరిస్తామని తెలిపారు. ఇప్పుడు బంతి మాస్కో కోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణకు కీవ్ అంగీకరించిందని, తక్షణమే శాంతి చర్చల జరగాలని కోరుకుందని అన్నారు. శాంతికి రష్యా కూడా అంగీకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్లు అంగీకరించకుంటే శాంతికి అడ్డంకి ఏంటో మనకు స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు సౌదీకి వెళ్లినప్పటికీ ఈ చర్చల్లో మాత్రం ఆయన పాల్గొనలేదు. మరోవైపు, సౌదీలో అమెరికాతో చర్చలు జరుగుతుండగానే.. రష్యాపై వందలాది డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిచేసింది. మాస్కో, కుర్స్క్ ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలిటరీ తెలిపింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa