చిత్తూరులో కాల్పుల ఘటన కలకలం రేపింది. బుధవారం ఉదయం ఓ ఇంట్లోకి దొంగలు చొరబడటం.. కాల్పులు జరిగాయంటూ హైడ్రామా నడిచింది. దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో ఊహించని ట్విస్ట్ బయపడింది. పక్కగా ప్లానింగ్తో చోరీకి ప్లాన్ చేసినట్లు తేలింది.. ఈ వ్యవహారం మొత్తం నడిపింది ఒక ప్రముఖ వ్యాపారిగా గుర్తించారు. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ దోపిడీ యత్నం ఘటనలో బయటపడ్డ షాకింగ్ విషయాలతో అందరూ అవాక్కయ్యారు. దీంతో ఈ చోరీ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చిత్తూరులోని గాంధీరోడ్డులో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని, కాల్పులు జరిపారని హైడ్రమా నడిచింది. నగరంలోని గాంధీ రోడ్డులో ఉన్న లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ నివాసం ఉంటున్నారు. ఆయన నివాసంలోకి దొంగల ముఠా చొరబడింది. వారి దగ్గర రెండు తుపాకులు ఉన్నాయి.. వారు గాల్లోకి కాల్పులు జరపడంతో.. ఆ ఇంటి యజమాని భయపడ్డారు. వెంటనే తేరుకుని, అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు స్థానికులు అక్కడికి వచ్చారు.. ఇంతలో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. స్థానికుల సాయంతో పోలీసులు ఆ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా దగ్గర నుంచి తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్కు స్వల్పంగా గాయాలయ్యాయి.
నగరంలో ఈ ఘటన కలకలంరేపగా.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దోపిడీకి వచ్చిన దొంగల్ని ప్రశ్నిస్తే అసలు గుట్టు మొత్తం బయటపడింది. కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి.. చిత్తూరుకు చెందిన ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని ఓ ముఠాతో డీల్ చేసుకున్నట్లు గుర్తించారు. వీరు రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేసినట్లు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫర్నీచర్ షాప్ యజమాని కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో చోరీకి ఎందుకు ప్లాన్ చేయించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్న యజమాని అప్పుల పాలయ్యారని.. అందుకే చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ దోపిడీ ప్రయత్నం వెనుక ఎవరున్నారు.. అసలు ప్లాన్ చేయడానికి కారణం ఏంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa