జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఏపీ శాసనమండలిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ... తాను ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన బాధ్యతను మరింత పెంచారని చెప్పారు. ప్రభుత్వ పాలనలో ప్రజాసేవ చేసేందుకు తనను ఎమ్మెల్సీ చేసిన చంద్రబాబు, పవన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బీద రవిచంద్ర, సోము వీర్రాజు, గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని నాగబాబు అన్నారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా తనతో పాటు ఉన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇన్నేళ్ల తన రాజకీయ ప్రయాణంలో తనతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు... ముఖ్యంగా జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు, మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. మరోవైపు నాగబాబును మంత్రిని చేస్తామని గతంలోనే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |