భారతదేశం వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఈ రంగుల పండుగను జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో సంబురంగా గడుపుతారు. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ పండుగను ఘనంగానే జరుపుకోవడం చూస్తుంటాం. ఇక న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం దేశ ప్రజలతో కలిసి ఈ రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. 3... 2... 1 అంటూ క్లౌడ్ గులాల్ సిలిండర్ ఉపయోగించి జనంపై కివీస్ ప్రధాని రంగులు చల్లుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ప్రధాని లుక్సాన్ పలుమార్లు భారతదేశాన్ని ప్రశంసిస్తూ "నేను ఇండియాకి పెద్ద అభిమానిని... ఇది నేను ప్రేమించే, ఎంతో ఆరాధించే దేశం" అని పలుమార్లు అన్నారు.ఇక వాణిజ్యం, పెట్టుబడులు సహా కీలక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి లుక్సాన్ మార్చి 16 నుంచి 20 వరకు భారత్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి రావడం ఇదే మొదటి సారి కూడా. ఈ పర్యటనలో భాగంగా మార్చి 17న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వాణిజ్యం, రక్షణ సహకారం, ప్రజల మధ్య సంబంధాలను విస్తరించడంపై చర్చించనున్నారు. అనంతరం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. అలాగే మార్చి 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పర్యటించి తిరిగి వెల్లింగ్టన్కు పయనమవుతారు.
![]() |
![]() |