గుంటూరు మేయర్ పదవికి వైసీపీ నేత కావటి మనోహర్నాయుడు రాజీనామా చేశారు. కావటి మనోహర్ నాయుడు 2021లో వైసీపీ నుంచి గుంటూరు మేయర్గా ఎన్నికయ్యారు. మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఏడాది పదవీకాలం ఉండగానే మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు చెప్తున్నారు. మేయర్కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ తాను పదవిలో ఉండాల్సిన అవసరం లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు తెలిపారు.
మరోవైపు గత కొన్నిరోజులుగా నగర కమిషనర్, మేయర్ మనోహర్ నాయుడు మధ్య వివాదం నడుస్తోంది. అలాగే ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోయింది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కూటమిలో చేరటంతో వైసీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితులు మధ్య మార్చి 17న స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మరో ఏడాది పదవీ కాలం ఉండగానే మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు.
నిబంధనల ప్రకారం మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చన్న అంచనాల మధ్య ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. దీంతో జీఎంసీ కౌన్సిల్ సామర్థ్యం 63గా ఉంది. ప్రస్తుతం టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు, వైసీపీకి 23 మంది కార్పొరేటర్ల బలం ఉంది.
దీనికి తోడు టీడీపీకి అదనంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఓట్లు ఎక్స్ అఫిషియో సభ్యుల కోటాలో కలిసి రానున్నాయి. దీంతో కూటమి బలం 37కు చేరుతుంది. అయితే వైసీపీకి ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 25 మంది మద్దతే ఉంది. వైసీపీలోని మరికొంతమంది కార్పొరేటర్లు కూటమికి మద్దతు తెలిపితే అవిశ్వాస తీర్మానంలో మనోహర్ నాయుడు ఓడిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa