తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగితే.. తాజాగా వీడియో బయటపడింది. తిరుమలలో మద్యం మత్తులో యువకుడు ఓ మహిళతో గొడవకు దిగాడు.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించారు.. ఎందుకు గొడవపడుతున్నావని అడిగారు. విజిలెన్స్ సిబ్బందితో కూడా ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా.. 'నేను లోకల్ మందు తాగుతా అవసరమైతే మందు కూడా అమ్ముతా' అంటూ రెచ్చిపోయాడు. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోనే మద్యం మత్తులో యువకుడు ఇలా గొడవకు దిగడం కలకలం రేపింది. పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆ యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.. అతడు మహిళతో గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీటీడీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్
టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో శుక్రవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి. 'షటిల్.. టీటీడీ మహిళా అధికారుల డబుల్స్ పోటీల్లో శ్రీమతి రమాదేవి, కుమారి నీలిమ జట్టు విజయం సాధించగా, శ్రీ కుమారి దేవి, శ్రీ దామర సెల్వి జట్టు రన్నరప్ గా నిలిచింది. మహిళా అధికారుల సింగిల్స్ పోటీలలో శ్రీమతి రమాదేవి విజయం సాధించగా, శ్రీమతి మాధవి రన్నర్ గా నిలిచారు. పురుష అధికారుల డబుల్స్ పోటీల్లో శ్రీ గోవింద రాజన్, శ్రీ సురేంద్ర జట్టు విజయం సాధించగా, శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ పార్థసారథి జట్టు రన్నరప్ గా నిలిచింది. పురుష అధికారుల సింగిల్స్ పోటీల్లో శ్రీ సురేంద్ర విజయం సాధించగా, శ్రీ వెంకటేశ్వర్లు రన్నరప్ గా నిలిచారు. 45 ఏళ్ల పైబడిన మహిళ ఉద్యోగుల డాడ్జీ బాల్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి కె పద్మజ విజయం సాధించగా, శ్రీమతి పి పద్మజ రన్నర్ గా నిలిచారు' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
![]() |
![]() |