ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా జిల్లా మార్చాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లాకు అదనంగా కడప పేరును కలుపుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గతంలో ఈ జిల్లాకు కడప జిల్లా అనే పేరు ఉండేది. అయితే వైసీపీ హయాంలో కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాకు కడపను జోడించి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు గతేడాది అక్టోబర్లోనే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. కడప ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ జిల్లా పేరును మార్చాలంటూ సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ లేఖ రాశారు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవుని కడప ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిగా కొలువై ఉన్నారన్న సత్యకుమార్.. దేవుని కడప ఆలయ విశిష్టతను లేఖలో ప్రస్తావించారు. పూర్వం ఈ ప్రాంతంలో కృపాచార్యులు బస చేశారని, అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షాత్కారం పొందారని వివరించారు. కృపాచార్యులు శ్రీవారి కృప పొందిన ఈ ప్రదేశానికి కృపావతిగా నామకరణం చేశారని తెలిపారు. ఆ కృపావతి కాలక్రమంలో కుడపగా.. అనంతరం క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందినట్లు సత్యకుమార్ అప్పట్లో వివరించారు.
తిరుమలకు వెళ్లలేని వారి కోసం కృపాచార్యులు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్టించారని.. అప్పటి నుంచి శ్రీవారిని దర్శించడానికి వెళ్లేవారు ముందుగా దేవుని కడప శ్రీవారిని దర్శించటం ఆచారంగా మారిందని రాసుకొచ్చారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న కడప పేరును వైసీపీ అవగాహన రాహిత్యంతో వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందన్న సత్యకుమార్ యాదవ్.. పేరు మార్పుతో శ్రీవారి భక్తులు బాధపడ్డారన్నారు. ఇక కడప జిల్లా అభివృద్ధి కోసం వైఎస్ఆర్ ఎంతో కృషిచేశారనీ. కడప జిల్లా చారిత్రక నేపథ్యాన్ని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని పరిగణిస్తూ.. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పేరు మార్పునకు నిర్ణయం తీసుకుంది.
![]() |
![]() |