ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యాపారం బాగా జరగాలని దేవుడికి ఇలాంటి పూజా.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 05:52 PM

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని పెద్దలు చెప్పే సామెత ఎప్పుడైనా విన్నారా.. అబ్బే మాకంత టైమెక్కడుందడీ.. పొద్దున్నే ఫేస్ బుక్, మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్, సాయంత్రం షేర్ చాట్, రాత్రికి యూట్యూబ్... అబ్బో క్షణం కూడా తీరికలేదంటారా.. సరే అలాగే కానివ్వండి.. కానీ రొటీన్‌కు భిన్నంగా కొంతమంది వెరైటీగా వ్యవహరిస్తుంటారు. అలాంటప్పుడు ఈ సామెతను వాడుకోవచ్చు. అంటే మనిషి మనిషికీ ఆలోచనలు మారుతాయని చెప్పడమన్నమాట. సరే ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. సాధారణంగా పూజలు ఎలా చేస్తుంటారు.. ఓ దీపం, ఓ అగరబత్తీ, ఓ టెంకాయ, కొంచెం ప్రసాదం, అది అందుబాటులో లేకపోతే చిన్న బెల్లం ముక్క. ఇవన్నీ దేవుడి ముందు ఉంచి మన కోరికల చిట్టాను దేవుడి ముందు లిస్టు చదువుతూ ఉంటాం. కానీ.. వీడెవడండీ బాబూ.. ఇలా ఉన్నాడనుకునే ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.


మామూలుగా అష్టోత్తర శతనామాలు చదువుతూ పూజలు చేయటం చూసుంటాం. అష్టదళ పాద పద్మారాధన సేవ, తులసీదళాల సేవ ఇలాంటివెన్నో వినుంటాం. కానీ ఏలూరులో మాత్రం ఓ వ్యాపారి మాత్రం.. దేవుడికి వెరైటీగా పూజ చేస్తున్నాడు. తన లిక్కర్ బిజినెస్ బాగా జరగాలి దేవుడా అని కోరుకుంటూ ఓ మద్యం వ్యాపారి దేవుడి ముందు మద్యం బాటిళ్లు ఉంచి రోజూ పూజలు చేస్తున్నాడు. ఇక ఈ వెరైటీ పూజ చూసిన కస్టమర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ తర్వాత కడుపులో చుక్కేసుకుంటున్నారు. ఎవరి వెర్రి వారికి ఆనందమే అయినా దేవుడి ముందు మందు బాటిళ్లు ఏమిటబ్బా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. దీని గురించి స్థానికంగా విచిత్రంగా చెప్పుకొంటున్నారు.


అయితే దేవుడికి మద్యం బాటిళ్లు నైవేద్యంగా ఉంచడం మన దేశంలో అక్కడక్కడా జరుగుతున్న వ్యవహారమే. ఆర్థిక రాజధాని ముంబై దగ్గరలో ఉన్న చెంబూరులో బాబా భైరోన్ నాథ్ ఆలయం ఉంది. ఈ దేవుడిని స్థానికులు శివుని అవతారంగా భావిస్తుంటారు. కార్తీక ఏకాదశి సందర్భంగా బాబా భైరోన్ నాథ్ ఆలయంలోని దేవుడికి భక్తులు విస్కీ, రమ్ము, వోడ్కా వంటి మద‍్యం బాటిళ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటారు. అలాగే కేరళలోనూ ఇలాంటి పద్ధతి ఉంది. కేరళలోని మలక్కుడ మహోత్సవంలో దుర్యోధనుడికి పూజలు చేస్తుంటారు. ఈ సందర్భంగా దుర్యోధనుడికి భక్తితో మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కొల్లాం జిల్లా పొరువళిలోఉన్న పెరువిరుతి మలనాడ ఆలయంలో ఈ ఆచారం ఉంది.


అయితే ఈ ఆచారం రావటానికి వెనుక కూడా ఓ కథ ఉందని స్థానికులు చెప్తుంటారు. ఓసారి దుర్యోధనుడు ఈ ఊరి మీదుగా వెళ్తూ దాహం వేసి.. గ్రామస్తులను తాగడానికి నీళ్లు అడిగాడట. కానీ ఊర్లోని ఓ వ్యక్తి నీళ్లకు బదులుగా కల్లు ఇచ్చాడని, ఆ కల్లు తాగిన దుర్యోధనుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్లాడని చెప్తుంటారు. అప్పటి నుంచి మద్యం నైవేద్యంగా ఉంచడం ఆనవాయితీగా మారిందని స్థానికుల నమ్మకం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa