గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడిన సంఘటన సంచలనం కలిగించింది. గుజరాత్ పోలీసులు జరిపిన సోదాల్లో 107 కిలోల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్మెంట్ లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఆ దాడిలో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.
ఇటువంటి అక్రమ బంగారం రవాణా చర్యలను అడ్డుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో.. అపార్ట్బెంట్లోని ఓ బ్రోకర్ ఇంట్లో ఉన్న అక్రమ బంగారం బిస్కెట్లతో పాటు నగల రూపంలో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీరు స్వాధీనం చేసుకున్న వాటిలో 88 కిలోల బంగారు కడ్డీలు, 19.66 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 1.37 కోట్ల నగదు ఉన్నాయి. ఈ ఆపరేషన్ ద్వారా అదనంగా వివిధ వస్తువులను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అందులో 11 విలాసవంతమైన గడియారాలు.. వీటిలో డైమండ్తో అలంకరించిన పటెక్ ఫిలిప్ గడియారం, జేకబ్ అండ్ కో టైంపీసు, ఫ్రాంక్ ముల్లర్ గడియారం ఉన్నాయి. వీటితో పాటు.. నగదు, డైమండ్స్ , ఇతర విలువైన రత్నాలు కూడా ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో ఈ బంగారం అక్రమంగా నిల్వ ఉంచబడినట్లు తెలుస్తోంది. కానీ పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. గుజరాత్లో గత కొన్ని నెలలుగా బంగారం అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2023 జూలైలో సూరత్ ఎయిర్ పోర్టులో జరిగిన స్వాధీనంలో దాదాపు రూ. 25 కోట్ల విలువైన 48.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆపరేషన్లో షార్జా నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులు.. ఒక ఎయిర్పోర్ట్ ఉద్యోగిని అరెస్టు చేయడం జరిగింది.
ఈ ప్రయాణికులు తమ బ్యాగేజీలో 20 ప్యాకెట్ల బంగారం దాచిపెట్టారు. వారు స్క్రీనింగ్ చెక్ పాయింట్ను తప్పించుకోవడానికి టాయిలెట్లో బంగారాన్ని మార్చిపెట్టే ప్రయత్నం చేశారు. 2023 జూలై నెలలో అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ ఒక నగల వ్యాపారిని అరెస్టు చేసింది. అతడు దుబాయ్ నుండి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ తరహా అక్రమ రవాణా కేసులు గుజరాత్ లో పెరుగుతున్న నేపథ్యంలో.. గుజరాత్ ఏటీఎస్, డీఆర్ఐ వారు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. 2021 నుండి వారు ఈ అక్రమ రవాణా వ్యవస్థను అడ్డుకునేందుకు చేస్తున్న కృషి గణనీయంగా పెరిగింది. వారి చర్యలు అక్రమ బంగారం రవాణాను నియంత్రించేందుకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ పోలీసులు ఇప్పటికే చాలా మంది నిందితులను అరెస్టు చేసి.. వారు వినియోగిస్తున్న పద్ధతులు, మార్గాలు గమనించి.. తమ చర్యలను మరింత పదును పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa