ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించమంటూ సుదీక్ష కోణంకి తల్లిదండ్రుల అభ్యర్థన

international |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:11 PM

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి కరేబియన్ దేశానికి విహార యాత్ర కోసం వెళ్లి.. అక్కడే అదృశ్యం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతుండంగా.. పోలీసులు ఆమె కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఆమె తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తమ కుమార్తె కనిపించకుండా పోయి 12 రోజులు కావొస్తుండగా.. ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులే ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికాలోని వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష కోణంకి.. ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవలే విహార యాత్ర కోసం డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. అక్కడే ప్యూంటా కానా పట్టణానికి వెళ్లిన ఆమె మార్చి 6వ తేదీన రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరి సారిగా కనిపించింది. తెల్లవారుజాము 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష కోణంకి ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ముఖ్యంగా సుదీక్ష కోణంకి తల్లిదండ్రులు.. తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానంగా ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో అధికారులు సైతం డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో వెతికి.. కిడ్నాప్‌కు గురైందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఈక్రమంలోనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితమే బీచ్ వద్ద ఆమె బట్టలు, చెప్పులు దొరకగా.. అవి ఆమెవే అని స్నేహితులు కూడా గుర్తించారు. అలాగే వారంతా పార్టీ చేసుకున్న ఓ బార్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. సుదీక్ష కోణంకి తన సీనియర్ అయిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబెత్ కోలిసి బీచ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.


అయితే మార్చి 6వ తేదీ రోజు తామిద్దరం కలిసే బీచ్‌కు వెళ్లామని.. సుదీక్షతో పాటు తాను కూడా ఉన్నట్లు రిబె అంగీకరించాడని పోలీసులు చెప్పారు. కానీ బీచ్‌లో ఉండగా.. ఓ పెద్ద అల వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ తప్పి పడిపోయాడని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదని కూడా వెల్లడించారు. రిబె నిజమే చెప్పాడని.. అతడి తప్పేమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈక్రమంలోనే సుదీక్ష తల్లిదండ్రులు దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ కేసులో అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని వివరించారు.


తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించాలని.. సుదీక్ష మరణం విషయంలో ఎవరిపైనా అనుమానం లేదని వెల్లడించారు. అయితే మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నామని చెప్పారు. అలాగే ఈ విషయంలో అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com