సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఊరట లభించింది. పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్, నారా లోకేష్ మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వారి మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారంటూ టీడీపీ నేత బండారు వంశీకృష్ణ 2024 అక్టోబరు 9న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించారు.
అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలంటూ పోసాని కృష్ణ మురళి గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద ఇరుపక్షాల వాదనలు పూర్తికాగా.. న్యాయస్థానం తీర్పును మార్చి 21కి వాయిదా వేసింది. ఈ రోజు మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బెయిల్ మంజూరైనప్పటికీ పోసాని కృష్ణ మురళి విడుదల అవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. రెండు మూడు కేసులలో బెయిల్ కూడా వచ్చింది. దీంతో పోసాని విడుదల అవుతారనుకునే సమయంలో సీఐడీ పీటీ వారెంట్ జారీచేసి విచారించింది. ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరు జైలుకు రిమాండ్కు తరలించారు.
ఫిబ్రవరి నెలాఖర్లో పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ఆయన నివాసంలో రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజంపేట జైలుకు తరలించారు. అయితే పలు చోట్ల కేసులు నమోదు కావటం, పీటీ వారెంట్లు జారీ కావటంతో పోసాని కృష్ణ మురళి వేర్వేరు కోర్టులకు హాజరవుతూ వచ్చారు. కోర్టులు రిమాండ్ విధించడంతో కర్నూలు, గుంటూరు జైళ్లకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa