అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ సుంకాల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తోందని పేర్కొన్నారు. భారత్తో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి కానీ.. సుంకాల విషయంలో సమస్య ఉందని అన్నారు. అమెరికా వస్తువులపై సుంకాలను భారత్ తగ్గిస్తుందనే నమ్ముతున్నానని పేర్కొన్నారు. కానీ, ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాల విధింపునకు కట్టుబడి ఉన్నామని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. బ్రీట్బార్ట్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, అమెరికా సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు.
‘భారత్తో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఒకే ఒక్క సమస్య ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధిస్తోంది... సుంకాలను తగ్గిస్తారనే బలంగా నమ్ముతున్నా... అయితే, ఏప్రిల్ 2 నుంచి మేమూ ప్రతీకార సుంకాలను వసూలు చేస్తాం.. వారు ఎంత విధిస్తే అంతే మొత్తం విధిస్తాం’ అని స్పష్టం చేశారు.
భారత్-పశ్చిమాసియా-ఐరోపా ఎకనమిక్ కారిడార్ (ఐఎంఈసీ)పై స్పందిస్తూ.. అది అత్యద్భుత దేశాల కూటమి అని కొనియాడారు. కానీ, ఆ దేశాలన్నీ కలిసి సుంకాల విషయంలో అమెరికాను ఇబ్బందికి గురిచేయాలని చూస్తున్నాయని అన్నారు. మమ్మల్ని చెడుగా చూసేందుకు అనుమతించబోమని, పలు మార్గాల్లో సత్ఫలితాలను సాధించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ‘‘కొన్ని సందర్భాల్లో మనతో అంత స్నేహంగా ఉండని దేశాలు... వాణిజ్యపరంగా మనతో దారుణంగా వ్యవహరించే ఐరోపా సమాఖ్య లాంటి స్నేహపూర్వకంగా ఉండాల్సిన దేశాల కంటే మనతో బాగా వ్యవహరిస్తాయి... భారత్ సహా ప్రతి ఒక్కటి మిత్రదేశంగా భావిస్తారు’’ అని వివరించారు.
కాగా, ట్రంప్ తరుచూ భారత్ సుంకాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. భారత్ టారిఫ్ కింగ్ అని, భారీ దోపిడీదారుని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. గత నెలలో అమెరికాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వైట్హౌస్లో ట్రంప్తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురూ కలిసి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ.. సుంకాల విషయంలో భారత్ బలంగా ఉందని, ఇందుకు వారిని తప్పుబట్టడం లేదు కానీ, వ్యాపారంలో ఇది వేరే మార్గమని అన్నారు. అంతేకాదు, వాణిజ్యపరమైన ఆటంకాలు ముఖ్యంగా అధిక సుంకాలతో భారత్కు వస్తువులను ఎగుమతి చేయడం చాలా కష్టతరంగా మారిందని ట్రంప్ ఆరోపించారు.
అయితే, దీని తర్వాత సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని, తాము బహిర్గతం కావడంతో ఈ చర్యలు చేపట్టిందని ట్రంప్ ప్రకటించారు. కానీ, దీనిని భారత్ తోసిపుచ్చింది. సుంకాలు తగ్గింపుపై అమెరికాకు ఎటువంటి హామీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa