ట్రెండింగ్
Epaper    English    தமிழ்

205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి,,,న్యూజిలాండ్‌పై మూడో టీ20లో పాక్ విజయం

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 10:37 PM

వరుస ఓటములకు పాకిస్తాన్ బ్రేక్ వేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి పాకిస్తాన్ జట్టుపై విమర్శలు ఎక్కువయ్యాయి. వరుసగా ఓడిపోతున్న ఆ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లే సెటైర్లు వేస్తున్నారు. గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టిన పాక్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడింది. అయితే మూడో టీ20లో బౌన్స్ బ్యాక్ విన్‌తో అందరి నోళ్లు మూయించింది.


న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ సత్తా చాటింది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన మూడో టీ20లో రిమార్కబుల్ విక్టరీ సాధించింది. పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ సెంచరీతో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన పాకిస్తాన్, మూడో మ్యాచ్‌లో విజయం సాధించింది.


టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఛాప్‌మన్ 44 బంతుల్లో పదకొండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేయగా.. కెప్టెన్ బ్రాస్‌‌వెల్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. ఛాప్‌మన్, బ్రాస్‌వెల్ రాణించడంతో న్యూజిలాండ్ జట్టు 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో హారీశ్ రావూఫ్ మూడు వికెట్లు తీసుకోగా.. అఫ్రిది, అబ్రార్, అబ్బాస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు కూడా ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు మహమ్మద్ హారీశ్, హసన్ నవాజ్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 41 పరుగులు చేసిన మహమ్మద్ హారీశ్ టీమ్ స్కోర్ 74 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా హసన్ నవాజ్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.


హసన్ నవాజ్ కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 45 బంతుల్లోనే పది ఫోర్లు, ఏడు సిక్సర్లతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సల్మాన్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరూ సెంచరీ, హాఫ్ సెంచరీలతో నాటౌట్‌గా నిలిచి 16 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించేశారు. భారీ టార్గెట్‌ను పాకిస్తాన్ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు 2-1తో లీడింగ్‌లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com