ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్.. జనసేన కూడా వెళ్లిందా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 05:50 PM

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు రాజధాని చెన్నైలో డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.


"చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం" అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


మరోవైపు కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానాన్ని తమిళనాడు, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కూడగట్టే క్రమంలో చెన్నైలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు.. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించాయి.


డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తెస్తుందని పార్టీలు అభిప్రాయపడ్డాయి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. ఈ విధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఈ విధానం ద్వారా దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ వాణి కోల్పోతాయంటూ.. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్‌ను ఆమోదించొద్దని చెన్నై అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com