ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ కీలక నిర్ణయం.. ఆ ఆలయానికి మహర్దశ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 05:46 PM

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, అందుకు అనుగుణంగా గంగమ్మ ఆలయాన్ని అనివిధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని.. తిరుమల శ్రీవారికి సోదరిగా చెబుతారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారని.. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.


ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా మొదటి విడతలో రూ.3.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ వివరించారు. ఇందులో భాగంగా ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రెండో విడత అభివృద్ధి పనుల కోసం రూ.3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయని.. రెండో విడతలో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ ప్రాకారాలు, మరుగుదొడ్లు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి 14 కోట్ల రూపాయల నిధులు అవసరమని ఎమ్మెల్యే కోరారన్న టీటీడీ ఛైర్మన్.. వచ్చే బోర్డు సమావేశంలో నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే టీటీడీ నిధులతోనే గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


మరోవైపు తిరుపతి గంగమ్మ జాతర ఈ ఏడాది మే 6 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని ఛైర్మన్ వెల్లడించారు. తిరుపతి జాతర అంటే బ్రహ్మాండంగా నిర్వహించడం ఆనవాయితీ అని.. గంగమ్మ జాతరను తిరుపతి వాసులు ఎంతో భక్తిభావంతో జరుపుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం లోటుపాట్లు లేకుండా తిరుపతి గంగమ్మ జాతరను నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు,


తిరుపతి గంగమ్మ జాతర


మరోవైపు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను తిరుపతి గ్రామదేవతగా కొలుస్తారు. ఏటా మే నెలలో గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతర, ఏడు రోజుల పాటు జరుగుతుంది. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇక గంగమ్మ తల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి, అందుకే జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది. టీటీడీ నుంచి పసుపు కుంకుమ, శేషవస్త్రాలు సహా పుట్టింటి సారెను మేళతాళాలతో తీసుకువచ్చి సమర్పించడం ఆనవాయితీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com