ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్విట్టర్ పాత లోగో వేలం.. బ్లూ పిట్ట ఎంతకు అమ్ముడు పోయిందంటే

national |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:34 PM

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)ను ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఎవరూ ఊహించని విధంగా దాని పేరును ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చారు. అలాగే లోగోను సైతం బ్లూ బర్డ్ నుంచి ఎక్స్‌గా మార్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే తాజాగా ట్విట్టర్ పాత లోగో బ్లూ పిట్టను వేలం వేయగా.. రికార్డు ధర పలికింది. ఎవరూ ఊహించని స్థాయిలో దీనికి డబ్బులు రాగా.. ప్రజలంతా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకున్న ఈ లోగోకు ఇప్పటికీ అదే క్రేజ్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన ఈ వేలం పాటలో.. ఒకప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ వద్ద దర్శనం ఇచ్చిన ఈ బ్లూ బర్డ్ లోగో రికార్డు ధర పలికిందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 12 అడుగులు పొడవు, 9 అడుగుల వెడల్పు.. 254 కిలోల బరువు కల్గిన ఓ బ్లూ పిట్టను 35వేల డాలర్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు వివరించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.30 లక్షలు అన్నమాట. ఎవరో కొనుగోలు చేసినట్లు మాత్రమే చెప్పిన సంస్థ అతడి పేరును మాత్రం వెల్లడించలేదు.


కావాలనే సదరు వ్యక్తి తన వివరాలు ఎవరికీ చెప్పొద్దని కోరారని.. అందుకే ప్రకటించడం లేదంటూ కూడా ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ వివరించింది. అయితే ఈ లోగోను వేలానికి పెట్టింది మరెవరో కాదు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ఎక్స్ పాత విలువైన జ్ఞాపకాలను ఆ సంస్థ అధినేత మస్క్ వేలానికి పెట్టారు. దీనిలో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై ఉన్న పిట్ట బొమ్మ సైన్ బోర్డు కూడా ఉంది. అయితే ఈ లోగోను.. 2006లో ఏర్పాటు అయిన ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను.. పక్షుల కిలకిలరావాలకు గుర్తుగా డిజైన్ చేశారు. వెబ్ సైట్ క్రియేటివ్ బ్లాగ్ కథనం ప్రకారం లైట్ బ్లూ బర్డ్ సింబల్ కోసం అప్పట్లో 15 డాలర్లు చెల్లించి లోగో తయారు చేయించారు.


ఇదంతా ఇలా ఉండగా.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌ను 2022 అక్టోబర్ నెలలో కొనుగోలు చేశారు. అందుకోసం ఆయన ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్లు చొప్పున చెల్లించారు. ఇలా మొత్తంగా 44 బిలియన్ డాలర్లు చెల్లించి మరీ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను దక్కించుకున్నారు. ఆపై 75 శాతం మంది ఉద్యోగులను తొలగించి.. ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. అలాగే లోగోను సైతం మార్చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa