ఉత్తర ప్రదేశ్ మథుర జిల్లాలోని సున్రాక్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాజబాబుకు చాలా కాలంగా కడుపు నొప్పి వస్తుంది. అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఎన్ని మందులు వేసుకున్నా నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో తరచుగా తన సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుని మొబైల్ ఫోన్ తీసుకుని నెట్టింట వెతకడం ప్రారంభించాడు. ముఖ్యంగా యూట్యూబ్ ఓపెన్ చేసి కడుపు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలని సెర్చ్ చేశాడు. ఈక్రమంలోనే అనేక వీడియోలు వచ్చాయి. ఓ వీడియోలో కడుపు నొప్పి తగ్గాలంటే ఆపరేషన్ చేయించుకోవాలని చూపించగా.. రాజబాబు శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకున్నాడు.
కానీ సర్జరీ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని భావించి.. తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏమేం కావాలో వీడియోలో చూసి రాసుకున్నాడు. ఆపై మెడికల్ స్టోర్కు వెళ్లి వాటిని కొనుగోలు చేశాడు. ముఖ్యంగా సర్జికల్ బ్లేడ్, కుట్లు వేసుకునే సూదులు, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు. అనేక వీడియోలు చూసి సర్జరీ చేయడం ఎలాగో తెలుసుకున్నాడు. ముందుగా మత్తు సూది ఇచ్చుకుని.. ఆపై కడుపుపై 7 ఇంచుల మేర కోసుకున్నాడు. పొట్టలో వెతుకుతూ.. నొప్పికి గల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.
రాజబాబుకు ఏమీ అర్థం కాకపోవడంతో 11 ఇంచుల మేర కడుపు కోసుకున్నాడు. నొప్పి ఎక్కువ అవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి కేకలు వేశాడు. దీంతో కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చి చూసి షాక్ అయ్యారు. వెంటనే రాజబాబును స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కడుపు కోసి ఉండడం చూసి ఏమైందని అడగ్గా.. తానే సర్జరీ చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. అది విన్న వైద్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. కడుపు లోపలికి కట్ అవ్వడం గమనించి.. మెరుగైన చికిత్స నిమిత్తం ఆగ్రాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడానే ఉండగా.. రాజబాబుకు 18 ఏళ్ల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa