తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం కేన్సర్ కోరల్లో చిక్కుకుంది. ఒకరు ఇద్దరు కాదు.. ఏడాదిలో ఏకంగా 200 మంది ఆ గ్రామంలో కేన్సర్ బారినపడ్డారు. వీరిలో 30 మంది మహమ్మారికి బలయ్యారు. పచ్చని పొలాలు, విలాసవంతమైన భవంతులు, నిత్యం వ్యవసాయంతో హాయిగా జీవనం సాగించే ఆ గ్రామస్థులను కేన్సర్ భూతం భయపెడుతోంది. గత రెండు మూడేళ్లుగా విపరీతంగా కేన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. గొంతు, మెదడు, పెద్ద పేగు, రొమ్ము ఇలా పలు రకాల కేన్సర్లతో బాధపడుతున్నారు. మొత్తం 16 వేల మంది ఉండే ఈ గ్రామంలో కేన్సర్ వ్యాధి ఇంతగా విజృంభించడానికి కారణమేంటో అంతుచిక్కడం లేదు. కేన్సర్ బాధితులతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారూ ఎక్కువగా ఉన్నారు.
స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి.. గత శుక్రవారం శాసనసభలో ఈ అంశం ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. బలభద్రపురంలో కేన్సర్ వ్యాధి విజృంభణ తీవ్రంగా ఉందని, పరీక్షలు నిర్వహించి, బాధితులకు చికిత్స అందజేయాలని కోరారు. దానికి మూలకారణమేంటో గుర్తించాలని విన్నవించారు. బలభద్రపురంలో మహమ్మారి విజృంభించి, పదుల సంఖ్యలో జనం చనిపోతుంటే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గత మూడు నెలల్లో ముగ్గురే చనిపోయారని చెబుతున్నారని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తి, మీడియాలో కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. శనివారం నాడు వైద్య బృందాలు ఆ గ్రామానికి చేరుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ సుజాత ఆధ్వర్యంలో డాక్లర్లు, కేన్సర్ వ్యాధి నిపుణులు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. 93 మంది సిబ్బంది 31 బృందాలుగా విడిపోయి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సమాచారం సేకరిస్తున్నాయి. సోమవారం కేన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
గతంలో ఎవరైనా ఆ కుటుంబంలో కేన్సర్ బారిన పడ్డారా? వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలు సేకరించారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 23 మంది కేన్సర్ రోగులు ఈ ఆర్ధిక సంవత్సరంలో చికిత్స పొందినట్టు కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్యం వల్లే కేన్సర్ వ్యాధి విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆధ్వర్యంలో 25 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల కోసం రాజమహేంద్రవరంలోని ల్యాబ్కు పంపారు. దీనికి సంబంధించిన ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న గ్రాసిమ్ పరిశ్రమతో భూగర్భ జలాలు, వాయు కాలుష్యమై.. కేన్సర్ భూతానికి కారణమైందనే వాదన కూడా ఉంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే నీటి నమూనాల ఫలితాల నివేదిక రావాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa