ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టు జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టల వివాదం.. వీడియోలు, ఫోటోలను బయటపెట్టిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 07:39 PM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ్.. సుప్రీంకోర్టుకు కీలక నివేదికను అందజేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించిన నివేదికలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనరు అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలను పొందుపరిచారు అనూహ్యంగా ఈ నివేదికను సుప్రీంకోర్టు అధికారి వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫైర్ విభాగం రెస్క్యూ ఆపరేషన్‌ వివరాలు, ఫొటోలు, వీడియోలు, సీజేఐ రాసిన లేఖ అందులో ఉన్నారు. న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోన్న సీజేఐ.. కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు విశ్వనీయ వర్గాలు పేర్కొన్నాయి. పారదర్శకతతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి అంగీకరించారని తెలిపాయి.


ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ్ సమర్పించిన నివేదికలో సగం కాలిన కరెన్సీ నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన ఉంది. దీనిపై అధికారిక సమాచారం ఉందని అందులో వివరించారు. మరోవైపు, స్టోర్‌ రూంలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి నగదును దాచిపెట్టలేదని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివరణ ఇవ్వడం గమనార్హం. బంగ్లాలో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో తమకు సంబంధించిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నా ఇంట్లో నగదు దొరికిందన్న ఆ వీడియోలోని కంటెంట్ చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను ఎందుకంటే ఇంట్లో మేము ఎటువంటి నగదు ఉంచలేదు.. కేవలం నన్ను ఇరికించి, నా ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా స్పష్టంగా కనిపించిందని గమనించాను’ అని జస్టిస్ వర్మ చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను భోపాల్‌లో ఉన్నానని, తన కుమార్తె ద్వారా సమాచారం తెలిసిందన్నారు.


అయితే, దీనిపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు సీజే అభిప్రాయపడ్డారు. మరోవైపు, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నిర్ణయించారు. ఇందు కోసం 3 రాష్ట్రాలకు చెందిన హైకోర్టుల జడ్జిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శీల్‌ నాగు, హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌లను సభ్యులుగా నియమించారు. ప్రస్తుతానికి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలూ అప్పగించొద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీజేఐ ఆదేశించారు.


అంతేకాదు, గత ఆరు నెలలుగా జస్టిస్ వర్మ ఇంట్లో విధులు నిర్వర్తించిన హైకోర్టు రిజిస్ట్రీ అధికారిక సిబ్బంది, వ్యక్తిగత భద్రతా అధికారులు, సెక్యూరిటీ గార్డుల వివరాలను సీజేఐ కోరారు. గత ఆరు నెలలుగా జస్టిస్ వర్మ అధికారిక లేదా ఇతర మొబైల్ ఫోన్ నంబర్ల కాల్ డేటా వివరాల కోసం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల సంప్రదించాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com