శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విభాగం పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాలంకరణ, ఇతర ఇంజినీరింగ్ పనులను జెఈవో పరిశీలించి, పలు సూచనలు చేశారు.
సర్వజగద్రక్షకుడైన స్వామివారు ఐదు రోజులపాటు రాత్రి 7.00 నుంచి 8.00 గంటల వరకు స్వామి పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. ప్రతి ఏటా పాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు ఘనంగా జరుగుతాయి. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 16న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 17న రుక్మిణీ సమేతంగా శ్రీక ష్ణస్వామి అవతారంలో మూడుమార్లు విహరిస్తారు. ఇక మూడవరోజు మార్చి 18న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 19న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 20వ తేదీ ఏడుమార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు : తెప్పోత్సవాల కారణంగా మార్చి 16, 17వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 18, 19, 20వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa