తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు టీటీడీ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపంగా టీటీడీ ధర్మకర్తల మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం వివిధ అంశాలపై టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలోని తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు.
అందులో భాగంగా టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఓసారి సుపథం టికెట్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ల ద్వారా మూడు నెలలకు ఓ సారి టీటీడీలోని శాశ్వత ఉద్యోగుల శ్రీవారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. అలాగే తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తామని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోని శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి భేటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. టీటీడీ ఆస్తులు కాపాడటానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్థులను తొలగించే విషయంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.
టీటీడీ భూములకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలపై పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని టీటీడీ ఛైర్మన్ వివరించారు. వివిధ రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని సంకల్పించామన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. వచ్చే ఏడాదిలోపు దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. టీటీడీ మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను పునరుద్ధించాలని నిర్ణయం తీసుకున్నామని.. అలాగే గ్రామాలలో పలుచోట్ల ఆగిపోయిన ఆలయాలను నిర్మించేందుకు సాయం చేయనున్నట్లు తెలిపారు. స్వామి వారికి కైంకర్యాల సామగ్రి సరఫరాలో అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. తిరుమలలో అనధికార హాకర్లు తొలగిస్తామని.. ఇందుకోసం విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు కేటాయింపుపై పాత విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు 2025-26 బడ్జెట్కు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. రూ.5,258.68 కోట్లతో రూపొందించిన బడ్జెట్కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.772 కోట్లతో గదులను ఆధునీకరించాలని ఇందులో నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa