కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో దారుణం జరిగింది. ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై సీనియర్ విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన వారం రోజుల కిందట జరిగినట్లు తెలిసింది. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పులపర్తికి చెందిన ఓ విద్యార్థికి కోడుమూరు ఎస్సీ హాస్టల్లో అనధికారికంగా ఉంటూ పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఆ విద్యార్థి జులాయిగా ఉండేవాడని, సిగరెట్లు తాగటంతో పాటుగా హాస్టల్లోని మిగతా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తాడని మిగతా విద్యార్థులు చెప్తున్నారు.
అయితే ఘటన జరిగిన రోజు రాత్రి తాము ట్యాబ్లెట్ల కోసం బయటకు వెళ్లినట్లు బాధిత విద్యార్థులు చెప్తున్నారు. అయితే రాత్రి వేళ బయటకు రావటంతో స్థానికులు కేకలు వేశారని.. దీంతో తామంతా హాస్టల్లోకి పరిగెత్తుకుని వచ్చినట్లు బాధిత విద్యార్థులు చెప్తున్నారు. అయితే పదో తరగతి విద్యార్థి దీనిని ఆసరాగా చేసుకుని తమను కొట్టినట్లు ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తెలిపారు .దొంగతనానికి వెళ్లారని ఆరోపిస్తూ బెల్టుతో ఇష్టానుసారం కొట్టినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ఏడో తరగతి విద్యార్థులపై పదో తరగతి విద్యా్ర్థి దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనం మండిపడుతున్నారు. విద్యార్థులను ఇంత అమానుషంగా కొడుతుంటే హాస్టల్ నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు, ఇలాంటి ఘటనలు జరగకుండా హాస్టల్ నిర్వాహకులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచాలని, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని నెటిజనం కోరుతున్నారు. కోడుమూరు ఎస్సీ హాస్టల్ దాడి ఘటనపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa