ఎమ్మెల్యే వస్తున్నారంటే హడావిడి ఎలా ఉంటుంది. ఫ్లెక్సీలు, కార్లు, కాన్వాయిలు ఇలా సందడి సందడిగా ఉంటుంది. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం కొంచెం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గానూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. ఆకస్మిక పర్యటనల కోసం స్కూటీ మీద చక్కర్లు కొడుతున్నారు. అరే.. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రోడ్డుపై బైక్ మీద తిరగడం ఏమిటని అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు సంగతి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇటీవల 303 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 9వ తేదీన ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మిగతా పనులకు ఆ తర్వాత శంకుస్థాపనలు చేశారు. ఈ అభివృద్ధి పనుల విలువ సుమారుగా రూ.200 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. అయితే శంకుస్థాపన సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. 60 రోజుల్లోగో ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని.. మే 20వ తేదీ నాటికి ప్రజలకు అంకితం చేస్తామంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం పనుల పురోగతిని తెలుసుకునేందుకు, వేగవంతం చేసేలా సూచనలు ఇచ్చేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకస్మిక పర్యటనలకు వెళ్తున్నారు.
మామూలుగా హంగామాతో వెళ్తే పనులు పరిశీలించలేమని భావించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. హెల్మెట్ ధరించి, స్కూటర్ మీద తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులకు కీలక సూచనలు చేశారు. మరోవైపు సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ డివిజన్లో అభివృద్ధి పనులను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఆకస్మికంగా పర్యటించిన కోటంరెడ్డి.. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కొన్ని విజ్ఞప్తులు అందజేశారు. వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో నిధులు ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తామని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి ఆకస్మిక పర్యటనలు రాబోవు రోజుల్లో కూడా కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఎమ్మెల్యే ఇలా స్కూటర్పై ఆకస్మిక పర్యటనలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆ తర్వాత వివిధ కారణాలతో వైసీపీకి దూరమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa